ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. 'శుభ్మన్ గిల్.. ఈ ఎక్స్ట్రాలే వద్దు! నువ్వేం తోపు కాదు!'అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా టెస్ట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపికైన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్తో జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా జరిగే తొలి టెస్ట్తో కెప్టెన్గా శుభ్మన్ గిల్ ప్రయాణం మొదలవ్వనుంది. ఈ సిరీస్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్స్ ఫొటో షూట్ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఈ ఫొటో షూట్లో.. తన ఎమ్ఆర్ఎఫ్ బ్యాట్తో ఫోజిచ్చిన శుభ్మన్ గిల్ ఫొటోపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోలో గిల్ పట్టుకున్న ఎమ్ఆర్ఎఫ్ బ్యాట్పై ప్రిన్స్ అనే ట్యాగ్ ఉంది. శుభ్మన్ గిల్ను ముద్దుగా అభిమానులు ప్రిన్స్ అని పిలుస్తారు. అయితే ఈ ట్యాగ్ను బ్యాట్పై పెట్టుకోవడాన్ని కొంతమంది నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా ఇలా ట్యాగ్ పెట్టుకోలేదని గుర్తు చేస్తున్నారు. క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్.. కింగ్ విరాట్ కోహ్లీలు కూడా తమ ఎమ్ఆర్ఎఫ్ బ్యాట్పై ఆ ట్యాగ్లను పెట్టుకోలేదని కామెంట్ చేస్తున్నారు. దిగ్గజ ఆటగాళ్లే ఇలాంటి వాటికి దూరంగా ఉన్నప్పుడు.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శుభ్మన్ గిల్కు ఈ ఎక్స్ట్రాలు అవసరమా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వచ్చే పేర్లను ట్యాగ్లగా వాడుకోవద్దని, అత్యుత్తమ ప్రదర్శనతో బిరుదులు అందుకోవాలని చురకలంటిస్తున్నారు.
కెప్టెన్గా శుభ్మన్ గిల్ సత్తాకు ఇంగ్లండ్ పర్యటన పరీక్షగా నిలవనుంది. విదేశీ గడ్డపై అతని బ్యాటింగ్ రికార్డ్స్ కూడా మెరుగ్గా లేవు. ఇటు బ్యాటింగ్తో పాటు అటు కెప్టెన్గానూ నిరూపించుకోవాల్సిన బాధ్యత గిల్పై ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి అనుభవం కలిగిన బ్యాటర్లు లేకుండా బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఇంగ్లండ్ గడ్డపై ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా..ముమ్మరంగా సాధన చేస్తోంది.
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.