టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు మరోసారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చేతిలో ఖంగుతిన్న శ్రేయస్ అయ్యర్.. తాజాగా మరో ఫైనల్లో ఓటమిపాలయ్యాడు. ముంబై టీ20 ప్రీమియర్ లీగ్లో సోబో ముంబై ఫాల్కన్స్ జట్టును నడిపించిన శ్రేయస్ అయ్యర్కు గురువారం జరిగిన ఫైనల్లో నిరాశే ఎదురైంది. ముంబై సౌత్ సెంట్రల్ మరాఠ రాయల్స్ జట్టుతో జరిగిన తుది పోరులో సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఫైనల్ మ్యాచ్లోనూ శ్రేయస్ అయ్యర్ (17 బంతుల్లో 12) తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో ముంబై ఫాల్కాన్స్ జట్టుకు ఓటమి తప్పలేదు.
అయితే ఈ మ్యాచ్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. మ్యాచ్ అనంతరం ట్రోఫీ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రన్నరప్గా నిలిచిన శ్రేయస్ అయ్యర్ టీమ్కు రూ. 50 లక్షల ప్రైజ్మనీని అందజేశాడు. అనంతరం రన్నరప్ మెడల్ శ్రేయస్ అయ్యర్ మెడలో వేయబోతుండగా.. అతను రోహిత్ శర్మ చేతుల్లో నుంచి లాక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కొందరు రోహిత్-అయ్యర్ మధ్య ఉన్న సాన్నిహిత్యానికి ఇది నిదర్శనమని సానుకూలంగా కామెంట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం అయ్యర్ తీరును తప్పుబడుతున్నారు. ముఖ్య అతిథుల ముందు అలా ప్రవర్తించడం సరికాదని, మెడల్ లాక్కోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు ఫైనల్స్ ఓడినా శ్రేయస్ అయ్యర్కు బలుపు తగ్గడం లేదని ఘాటుగా విమర్శిస్తున్నారు. అతిథుల పట్ల ఇలా ప్రవర్తించడం అయ్యర్కు ఇది తొలిసారి కాదని, గతంలో బీసీసీఐ ప్రెసిడెంట్ పట్ల కూడా అయ్యర్ ఇలానే ప్రవర్తించాడని గుర్తు చేస్తున్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ భారత ఆటగాళ్లకు వైట్ జాకెట్స్ తొడిగాడు. శ్రేయస్ అయ్యర్ మాత్రం.. జాకెట్ తొడిగించుకోకుండా తీసుకొని స్వయంగా వేసుకున్నాడు. బీసీసీఐ పెద్దల ముందు కాస్త యాటిట్యూడ్ చూపించాడు. అప్పట్లో ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ కాగా.. బీసీసీఐ పెద్దల ముందు అయ్యర్ తన బలుపు చూపించాడని, ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోవాలని నెటిజన్లు మండిపడ్డారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్పై కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించని అయ్యర్.. వారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అయ్యర్ ఈ అటిట్యూడ్ తగ్గించుకుంటేనే టీమిండియా కెప్టెన్గా ఎదుగుతాడని లేకుంటే అత్యంత వేగంగానే భారత క్రికెట్కు దూరమవుతాడని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.