లండన్: టీమిండియా వికెట్ కీపర్, తెలుగు తేజం శ్రీకర్ భరత్పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కేఎస్ భరత్(5) దారుణంగా విఫలమయ్యాడు. మూడో రోజు ఆటలో రెండో బంతికే క్లీన్ బౌల్డ్ అయిన అతను.. ఆసీస్ యువ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్ ధాటికి క్రీజులో నిలబడలేకపోయాడు
కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవాల్సిన భరత్.. నిర్లక్ష్యపు బ్యాటింగ్తో వెనుదిరిగాడు. దాంతో ఫ్యాన్స్ అతనిపై మండిపడుతున్నారు. ఇషాన్ కిషన్ను తీసుకున్నా జట్టుకు ఉపయోగపడేవాడని కొందరంటే.. వృద్దిమాన్ సాహాను ఎంపిక చేయాల్సిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. రాహుల్ ద్రవిడ్ కోచ్గా చేసిన అతిపెద్ద తప్పిదం ఇదేనని, సౌతిండియా ఆటగాళ్లపై ఉన్న ప్రేమతో జట్టుకు నష్టం చేస్తున్నాడని మండిపడుతున్నారు.

కెప్టెన్గా ఉన్నప్పుడు కే వేణుగోపాల్ రావును ఇలానే ఆడించి మూల్యం చెల్లించుకున్నాడని, ఇప్పుడు కేఎస్ భరత్కు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నాడని మండిపడుతున్నారు. బోర్డు గవాస్కర్ ట్రోఫీలోనే బ్యాటింగ్ చేయలేకపోయిన కేఎస్ భరత్ ఇంగ్లండ్ కండిషన్స్లో ఎలా ఆడుతాడని అనుకున్నారని ప్రశ్నిస్తున్నారు.
151/5 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా.. ఆదిలోనే కేఎస్ భరత్ వికెట్ కోల్పోగా... క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్తో కలిసి అజింక్యా రహానే పోరాడుతున్నాడు. ఈ క్రమంలో 92 బంతుల్లో రహానే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. డ్రింక్స్ బ్రేక్ సమయానికి టీమిండియా 49 ఓవర్లలో 6 వికెట్లకు 209 పరుగులు చేసింది.
ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్సింగ్స్లో 469 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగగా.. అలెక్స్ క్యారీ(69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 48), డేవిడ్ వార్నర్(60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లకు తోడుగా మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీసారు. జడేజాకు ఓ వికెట్ దక్కింది.