బీసీసీఐ ప్రకటించిన 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల కాంట్రాక్ట్లను తొలగించడాన్ని తప్పుబడుతున్నారు. గతేడాదిగా జట్టుతోనే ఉన్న ఈ ఇద్దరి ఆటగాళ్లపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. దేశవాళీ క్రికెట్ ఆడకుండా బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసినందుకు వారి కాంట్రాక్ట్లను తొలగించింది.
బీసీసీఐ చర్యలతో గతేడాది గ్రేడ్ బి కాంట్రాక్ట్ కలిగిన శ్రేయస్ అయ్యర్, గ్రేడ్ సీ కాంట్రాక్ట్ కలిగిన ఇషాన్ కిషన్కు ఈ సారి ఏ కాంట్రాక్ట్ దక్కలేదు. సెంట్రల్ కాంట్రాక్ట్ల కోసం ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను పరిగణలోకి తీసుకోలేదని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు.

సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చినప్పుడు శ్రేయస్ అయ్యర్ కాస్త నిరుత్సాహంగా కనిపించాడు. అప్పట్లో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ కారణంతోనే అయ్యర్ కాంట్రాక్ట్ను తొలగించారని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇక ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ తొలిగించడం వెనుక రోహిత్ శర్మ కుట్ర ఉందని మరికొందరు ఆరోపిస్తున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇషాన్ కిషన్ సన్నిహితంగా ఉండటాన్ని రోహిత్ శర్మ సహించలేకపోతున్నాడని, దాంతో అతనికి తీరని అన్యాయం చేస్తున్నాడని మండిపడుతున్నారు.
దేశవాళీ క్రికెట్ ఆడనంత మాత్రానా గతేడాదిగా భారత జట్టుతో ఉంటూ కీలక ఇన్నింగ్స్లు ఆడిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ల కాంట్రాక్ట్లను తొలగించడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వన్డే ప్రపంచకప్లో శ్రేయస్ అయ్యర్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడని గుర్తు చేస్తున్నారు. 66.25 సగటుతో 530 పరుగులు చేశాడని కామెంట్ చేస్తున్నారు.
గుజరాత్కు చెందిన ఓ ప్లేయర్ వన్డే ప్రపంచకప్ మధ్యలోనే వెనుదిరిగినా.. 5 నెలలుగా జట్టుకు దూరంగా ఉంటున్నా.. ఫిట్నెస్ సాధించి ఐపీఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నా.. అతనికి గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ ఇచ్చారని మండిపడుతున్నారు. గుజరాత్ ఆటగాళ్లు ఓ న్యాయం..? ఇతర ఆటగాళ్లు ఓ న్యాయమా? అని ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్ట్ల్లో రోహిత్ శర్మకు అనుకూలంగా ఉన్న ఆటగాళ్లకు ప్రాధాన్యం దక్కిందని విమర్శిస్తున్నారు.