హైదరాబాద్: ఆసియాకప్ 2023 టైటిల్ గెలిచి ఫుల్ జోష్లో ఉన్న టీమిండియా మరో ఆసక్తికర సిరీస్కు సిద్దమైంది. వన్డే ప్రపంచకప్ ముంగిట పటిష్ట ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
ఆసియాకప్లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో గాయపడిన ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను తొలి రెండు వన్డేలకు పక్కనపెట్టారు. అతని స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను జట్టులోకి తీసుకున్నారు. తెలుగు తేజం తిలక్ వర్మకు మరోసారి అవకాశమిచ్చారు. తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చారు.

ఈ రెండు మ్యాచ్లకు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మూడో వన్డేతో రోహిత్ శర్మ తిరిగి సారథ్య బాధ్యతలు అందుకుంటాడు. అతనితో పాటు కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు కూడా రీఎంట్రీ ఇస్తారు. ఫిట్నెస్ నిరూపించుకుంటే అక్షర్ పటేల్ కూడా మూడో వన్డేకు అందుబాటులోకి వస్తాడు..
వర్షాల కారణంగా ఆసియాకప్లో చాలా మ్యాచ్లకు అంతరాయం కలిగింది. పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత బ్యాటింగ్ మాత్రమే సాధ్యమవ్వగా.. నేపాల్తో మ్యాచ్లోనూ ఓవర్లు కుదించారు. ఆ తర్వాత పాకిస్థాన్తో రెండు రోజుల పాటు పూర్తి మ్యాచ్ జరగ్గా.. బంగ్లాదేశ్తో మ్యాచ్కు సీనియర్ ఆటగాళ్లంతా దూరంగా ఉన్నారు.
శ్రీలంకతో జరిగిన ఫైనల్లో మహమ్మద్ సిరాజ్ ధాటికి 25 ఓవర్ల మ్యాచ్ కూడా జరగలేదు. గట్టిగా భారత జట్టు ఆడింది రెండే రెండు మ్యాచ్లు. అంతమాత్రానికే ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంపై అభిమానులు మండిపడుతున్నారు. సూపర్ ఫామ్లో ఉన్న ఆటగాళ్లను విశ్రాంతి పేరిట పక్కనపెడితే రిథమ్ కోల్పోతారని హెచ్చరిస్తున్నారు.

ఆసియాకప్లో పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచే ఇందుకు నిదర్శనమని, పాక్ బౌలర్ల ధాటికి మ్యాచ్ ప్రాక్టీస్ లేని టీమిండియా టాపార్డర్ కుప్పకూలిందని గుర్తు చేస్తున్నారు. బెంచ్ బలానికి అవకాశం ఇవ్వడంతో పాటు ఆటగాళ్లను తాజాగా ఉంచేందుకు విశ్రాంతి ఇస్తున్నామని అగార్కర్ చెప్పిన కారణంలోనూ పసలేదని మండిపడుతున్నారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్లు మాత్రమే ఫ్రెష్గా ఉండాలా? మిగతా ఆటగాళ్లు అవసరం లేదా? అని విమర్శిస్తున్నారు. ప్రపంచకప్ ముందు పటిష్టమైన ఆసీస్తో మ్యాచ్లు భారత ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ లభిస్తోందని సూచిస్తున్నారు. అనాలోచిత నిర్ణయాలు టీమిండియాకు నష్టం చేస్తున్నాయని మండిపడుతున్నారు.
సెప్టెంబరు 22న మొహాలీ వేదికగా తొలి వన్డే, సెప్టెంబరు 24న ఇండోర్ వేదికగా రెండో వన్డే, సెప్టెంబరు 27న రాజ్కోట్ వేదికగా మూడో వన్డే జరగనుంది. అనంతరం ఇరు జట్లు ప్రపంచకప్ ఆడతాయి.