ఆసియాకప్ 2025 బరిలోకి దిగే భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో సీనియర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కలేదు. చివరకు స్టాండ్ బై లిస్ట్లోనూ అయ్యర్కు అవకాశం కల్పించలేదు. అయితే జట్టుకు ఎంపిక కాకపోవడం వెనుక శ్రేయస్ అయ్యర్ తప్పిదం లేదని, అలాగే తమ తప్పిదం కూడా లేదని అగార్కర్ వివరణ ఇచ్చాడు. జట్టులోకి 15 మంది ఆటగాళ్లను మాత్రమే తీసుకుంటామని, దురదృష్టవశాత్తు అయ్యర్కు చోటు లేదన్నాడు.
అయితే అయ్యర్ను తప్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సెలెక్టర్లపై మండిపడుతున్నారు. హెడ్ కోచ్ గౌతం గంభీర్పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి గతేడాదిగా శ్రేయస్ అయ్యర్ వైట్ బాల్ ఫార్మాట్లో మెరుగైన ప్రదర్శన చేసినా అతన్ని ఆసియాకప్కు ఎంపిక చేయకపోవడం ఏంటని అభిమానులు మండిపడుతున్నారు.

వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కూడా అయ్యర్ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. కానీ ఇంగ్లండ్తో సిరీస్లో విరాట్ కోహ్లీ గాయంతో అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. జట్టులో నుంచి తప్పించలేని పరిస్థితి కల్పించాడు. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీలో అయ్యార్ను కొనసాగించారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు.
ఈ ఐసీసీ టోర్నీలోనే కాదు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ శ్రేయస్ అయ్యర్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. 188 స్ట్రైక్రేట్, దాదాపు 50 సగటుతో పరుగుల మోత మోగించాడు. ఈ సీజన్ ఐపీఎల్ అయ్యర్కు కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. 175 స్ట్రైక్రేట్ 50 సగటుతో 604 పరుగులు చేశాడు. ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్లు ఆడాడు. 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ను ఫైనల్ చేర్చాడు. ఇలాంటి ఆటగాడిని ఆసియా కప్ 2025 ఎంపిక చేయకపోవడం అందర్నీ విస్మయ పరుస్తోంది.
ఆసియా కప్ జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నా.. స్టాండ్ బై లిస్ట్లో మరో వికెట్ కీపర్ను ఉంచారు. ఆసియా కప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో చాలా మంది గణంకాలు అయ్యర్ కంటే చాలా దారుణంగా ఉన్నాయి. అయినా అయ్యర్ పేరును కనీసం స్టాండ్బై లిస్ట్లో చేర్చలేదంటేనే.. అతని సేవలను వాడుకోవడానికి టీమిండియా మేనేజ్మెంట్కు ఆసక్తిలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. జట్టులో చోటు లేక కాదు.. అయ్యర్ కెరీర్ను నాశనం చేసేందుకే అతని పక్కన పెట్టారనే అభిప్రాయం కలుగుతోంది.