టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికి అందర్నీ షాక్కు గురి చేశాడు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా సోమవారం వెల్లడించాడు. 14 ఏళ్ల టెస్ట్ కెరీర్కు ముగింపు పలుకుతున్నానని భావోద్వేగభరితమైన పోస్ట్తో పంచుకున్నాడు.
కోహ్లీ రిటైర్మెంట్ నేపథ్యంలో బీసీసీఐ అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేసింది. 'టెస్ట్ క్రికెట్లో ఓ శకం ముగిసింది. కానీ వారసత్వం మాత్రం కొనసాగుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. టీమిండియాకు కోహ్లీ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి'అని బీసీసీఐ పేర్కొంది.

అయితే ఈ పోస్ట్పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ తీరు కారణంగానే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడని, అతన్ని అవమానపరిచేలా వ్యవహరించారని మండిపడ్డారు. ఆటగాళ్ల కుటుంబ సభ్యులపై ఆంక్షలు విధించడం.. స్టార్ కల్చర్కు తెరదించుతామని పదే పదే చెబుతూ.. కోహ్లీని టార్గెట్ చేయడం నచ్చకనే అతను తప్పుకున్నాడని ఆరోపిస్తున్నారు.
విరాట్ కోహ్లీని తప్పించేందుకు భారీ కుట్ర చేశారని, ఇందులో గౌతమ్ గంభీర్తో పాటు ఇతర బీసీసీఐ పెద్దల హస్తం ఉందని కామెంట్ చేస్తున్నారు. ఏదో ఒక రోజు.. కోహ్లీ నోరు విప్పుతాడని, అప్పుడు అందరి బండారం బయటపడుతుందని హెచ్చరిస్తున్నారు. మరో 10 ఏళ్లకైనా కోహ్లీ.. తన వెనుక జరిగిన విషయాలను ఆటోబయోగ్రాఫ్లో వెల్లడిస్తారని అభిప్రాయపడుతున్నారు.
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వెనుక మీడియా హస్తం కూడా ఉందని, పదే పదే అతన్ని టార్గెట్ చేస్తూ వార్తలు రాసారని, ఇక నుంచి ఎవరిపై రాస్తారో చూడాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యంతో కోహ్లీని మానసికంగా హింసించారని మండిపడుతున్నారు. కోహ్లీకి ఉన్న ఫిట్నెస్ ప్రకారం అతను మరో నాలుగేళ్ల వరకు క్రికెట్ ఆడగలడని చెబుతున్నారు.
విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్లో 123 టెస్ట్లు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీ సక్సెస్ఫుల్ టీమిండియా కెప్టెన్. అతని సారథ్యంలో 68 మ్యాచ్లు ఆడిన టీమిండియా 40 మ్యాచ్లు గెలిచింది. మరో 770 పరుగులు చేసుంటే కోహ్లీ 10వేల పరుగుల క్లబ్లో చేరేవాడు.