ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) ఛాంపియన్గా నిలిచింది. సన్రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం చెపాక్ వేదికగా ఏకపక్షంగా సాగిన ఫైనల్లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజేతగా నిలిచింది. యదృశ్చికమో ఏమో కానీ ఈ రెండు టోర్నీల ఫైనల్స్.. ఫలితాలు ఒకేలా ఉండటం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

ఈ రెండు ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటవ్వగా.. యాదృశ్చికంగా విజేతగా నిలిచిన జట్లు 8 వికెట్ల తేడాతో గెలుపొందాయి. రెండు టోర్నీల్లో ఓడిన జట్ల కెప్టెన్లు ఆస్ట్రేలియా ప్లేయర్లు కాగా.. గెలిచిన జట్ల సారథులు భారత ప్లేయర్లు కావడం గమనార్హం.
అంతేకాకుండా ఓడిన ఆసీస్ కెప్టెన్లు ఇద్దరూ ఐసీసీ టోర్నీల్లో భారత్ను రెండు సార్లు ఓడించడం విశేషం. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. డబ్ల్యూటీసీతో పాటు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ను ఓడించి ఆసీస్ను విజేతగా నిలబెట్టాడు.
ఇక డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్.. మహిళల టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ను ఓడించి ఆసీస్కు టైటిల్ అందించింది.

కేకేఆర్కు కలిసొచ్చిన ఎమ్ అక్షరం..
ఐపీఎల్ ఫైనల్స్లో కేకేఆర్కు మరో ఎమ్ అక్షరం కలిసొచ్చింది. ఆ జట్టు ఐపీఎల్ టైటిల్ సాధించిన మూడు సందర్భంగా ఎమ్ అక్షరం కలిగిన ఆటగాళ్లు మ్యాచ్ విన్నర్గా నిలిచారు. ఐపీఎల్ 2012 ఫైనల్లో మన్వీందర్ సింగ్ బిస్లా, ఐపీఎల్ 2014 ఫైనల్లో మనీష్ పాండే, ఐపీఎల్ 2024 ఫైనల్లో మిచెల్ స్టార్క్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు.

ఈ క్రమంలోనే ఆసీస్కు ఎమ్ అక్షరం కలిసొస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.