టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ నాకౌట్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాకు పీడ కలలు మిగిల్చాడు. 2007 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో 30 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతో 70 పరుగులతో ఆసీస్ పతనాన్ని శాసించిన యువీ.. తాజాగా ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్(ఐఎమ్ఎల్) టీ20 టోర్నీ నాకౌట్ మ్యాచ్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 30 బంతుల్లో ఫోర్, 7 సిక్సర్లతో 59 రన్స్ చేసి ఆస్ట్రేలియాను చిత్తు చేశాడు. దాంతో నాకౌట్ మ్యాచ్ల్లో ఆసీస్కు అసలైన మొగుడు యువరాజ్ సింగేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా.. యువరాజ్ సింగ్లోని సత్తా అలానే ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వెటరన్ ఆటగాళ్లతో నవీ ముంబై, రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న ఐఎమ్ఎల్ టీ20 టోర్నీ తుది దశకు చేరుకుంది. సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా మాస్టర్స్ అద్వితీయమైన ప్రదర్శనతో ఫైనల్ చేరింది.

ఇండియా మాస్టర్స్ భారీ విజయం..
ఆస్ట్రేలియా మాస్టర్స్తో రాయ్పూర్ వేదికగా గత గురువారం జరిగిన సెమీఫైనల్-1లో ఇండియా మాస్టర్స్ 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా మాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 220 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్తో పాటు సచిన్ టెండూల్కర్(30 బంతుల్లో 7 ఫోర్లతో 42), స్టువర్ట్ బిన్నీ(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 36) రాణించారు. అనంతరం ఆసీస్ 18.1 ఓవర్లలో 126 పరుగులకు కుప్పకూలింది. బెన్ కట్టింగ్(39) మినహా అంతా విఫలమయ్యారు. షెహ్బాజ్ నదీమ్(4/15) నాలుగు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. వినయ్ కుమార్, ఇర్ఫాన్ పఠాన్ రెండేసి వికెట్లు తీయగా.. స్టువర్ట్ బిన్నీ, పవన్ నేగీ చెరో వికెట్ పడగొట్టారు.
అప్పుడు యువీ విధ్వంసం..
2007 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో యువరాజ్ సింగ్ విధ్వంసంతో టీమిండియా 15 పరుగుల తేడాతో ఆసీస్ను ఓడించింది. ఈ మ్యాచ్లో భారత్ 5 వికెట్లకు 188 పరుగులు చేయగా... ఆసీస్ 7 వికెట్లకు 173 పరుగులే చేసి ఓటమిపాలైంది. శ్రీశాంత్, ఇర్ఫాన్ పఠాన్, జోగిందర్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. హర్భజన్ సింగ్ ఓ వికెట్ పడగొట్టాడు.