టీమిండియా స్టార్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దుమ్మురేపుతున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫామ్ను కొనసాగిస్తూ ఐపీఎల్ 2025 సీజన్లో తనదైన బ్యాటింగ్తో చెలరేగుతున్నాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన శ్రేయస్ అయ్యర్.. లక్నో సూపర్ జెయింట్స్తో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్లోనూ (52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
10 మ్యాచ్ల్లో 6 హాఫ్ సెంచరీలు..
ఈ రెండు మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్ భారీ విజయాలందుకొని పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. బ్యాటర్గానే కాకుండా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లో కలిపి గత 10 ఇన్నింగ్స్ల్లో అయ్యర్.. వరుసగా 59, 44, 76, 15, 56, 79, 45, 47*, 52*లతో మొత్తం 556 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఒకే ఒక్క మ్యాచ్లో మాత్రం 15 పరుగులతో విఫలమయ్యాడు.

రోహిత్ తర్వాత..
శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయ్యర్ బ్యాటింగ్ అద్భుతంగా ఉందని నెటిజన్లు కొనియాడుతున్నారు. అతను ఇదే జోరును కొనసాగిస్తే.. రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అందుకుంటాడని, మూడు ఫార్మాట్లలో టీమిండియాను ఏలుతాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. శుభ్మన్ గిల్, రిషభ్ పంత్ కంటే శ్రేయస్ అయ్యర్ ఎంతో ప్రతిభ కలిగిన ఆటగాడని కొనియాడుతున్నారు. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
బీసీసీఐ ఆగ్రహానికి గురై..
కెరీర్లో ఎదురైన ఒడిదొడుకుల నుంచి అతను పుంజుకున్న విధానం ప్రతీ ఆటగాడికి స్ఫూర్తిదాయకమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గాయాలతో సతమతమైన శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ఆగ్రహానికి గురై భారత జట్టులో చోటుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు. ఐపీఎల్ 2024 సీజన్లో కేకేఆర్ను విజేతగా నిలబెట్టినా అతనికి అంతగా పేరు రాలేదు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన శ్రేయస్ అయ్యర్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు ఎంపికయ్యాడు.
కోహ్లీ గాయంతో
ఈ సిరీస్లోనూ అనూహ్యంగా.. చివరి నిమిషంలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ మోకాలి నొప్పితో బాధపడటంతో అతని స్థానంలో తొలి వన్డే ఆడిన అయ్యర్.. హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ సిరీస్లో నిలకడగా రాణించి.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోనూ కొనసాగాడు. అక్కడ కూడా అసాధారణ ప్రదర్శన చేసి భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఇప్పుడు ఐపీఎల్ 2025 సీజన్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు.