టీ20 ప్రపంచకప్ 2024లో అఫ్గానిస్థాన్ సంచలన విజయాన్నందుకుంది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అఫ్గానిస్థాన్ అద్భుతం చేసింది. బంగ్లాదేశ్తో మంగళవారం ఉదయం జరిగిన తమ చివరి సూపర్-8 మ్యాచ్లో అఫ్గానిస్థాన్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 8 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో గ్రూప్-1 సూపర్-8 పోరులో రెండో స్థానంలో నిలిచి సెమీ ఫైనల్కు అర్హత సాధించింది. అఫ్గాన్ సెమీస్ చేరడంతో బంగ్లాదేశ్, మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఇంటిదారిపట్టాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. వర్షం కూడా పదే పదే అంతరాయం కలిగించడం.. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడంతో అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజా దక్కింది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 115 పరుగులు చేసింది. రెహ్మానుల్లా గుర్బాజ్(55 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 43) ఒక్కడే రాణించగా.. రషీద్ ఖాన్(10 బంతుల్లో 3 సిక్సర్లతో 19 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్(3/26) మూడు వికెట్లు తీసాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకు కుప్పకూలింది. లిటన్ దాస్(49 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 54 నాటౌట్) ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరాటం చేశాడు. అఫ్గాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్(4/26), రిషిద్ ఖాన్(4/23) నాలుగేసి వికెట్లు తీసారు. ఫజలక్ ఫరూఖీ, గుల్బాదిన్ నైబ్ తలో వికెట్ తీసారు.
అఫ్గాన్ సంచలన విజయంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. రోడ్లపైకి భారీ ఎత్తున వచ్చిన జనాలు అఫ్గాన్ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. రోడ్లన్నీ జలమయం కావడంతో అక్కడి ట్రాఫిక్ వ్యవస్థ మొత్తం స్థంభించింది. రోడ్లను క్లియర్ చేసేందుకు అక్కడి అధికారులు ఫైర్ ఇంజిన్లను ఉపయోగించారు. జనాలపై నీళ్లు కొట్టి చెల్లా చెదురు చేసే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్కాగా...ఇదెక్కడి క్రేజ్రా అయ్యా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.