మండే వేసవిలో అంతులేని వినోదాన్ని పంచడానికి, రెండు నెలల పాటు సంబరాల్లో ముంచెత్తడానికి ఐపీఎల్ 2025 సీజన్ సిద్దమైంది. కొన్ని కొత్త నిబంధనలు.. కొందరు కొత్త కెప్టెన్లతో సరికొత్తగా ఐపీఎల్ 18వ సీజన్కు తెరలేవనుంది. మరికొద్ది గంటల్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య జరిగే మ్యాచ్తో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుంది.
అయితే ఉప్పల్ వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్తో సన్రైజర్స్ హైదరాబాద్ తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది. ఈ మ్యాచ్కు ముందే ఇరు జట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా సవాళ్లు విసురుకుంటున్నారు. గతంలో ఈ ఇరు జట్ల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దమే నడిచింది. గతంలో సన్రైజర్స్ను అవమానించేలా.. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ రెచ్చగొట్టేలా రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్ పోస్ట్లు పెట్టేవాడు.

ఆరెంజ్ జ్యూస్ పోస్ట్తో..
ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఆరెంజ్ జ్యూస్తో పోల్చుతూ రెచ్చగొట్టేవాడు. ఓటమి బాధలో ఉన్న ఫ్యాన్స్కు పుండు మీద కారం చల్లేలా సెటైరికల్ పోస్ట్లతో ఉక్కిరి బిక్కిరి చేసేవాడు. ఆరెంజ్ ఆర్మీ ఆటగాళ్ల జ్యూస్ పిండేస్తామనే ఉద్దేశంతో ఆరెంజ్ జ్యూస్ ఫొటోనూ షేర్ చేసేవాడు. సన్రైజర్స్ ఓడిపోతే.. జ్యూస్ పిండేసామనే అర్థం వచ్చేలా ఖాళీ గ్లాస్ను పెట్టేవాడు.
అంతేకాకుండా సన్రైజర్స్ ఓటమిని ఎగతాళి చేస్తూ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటామని ట్వీట్ చేసేవాడు. ఈ పోస్ట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ అడ్మిన్ కూడా చాలా సందర్భాల్లో తనదైన శైలిలో బదులిచి ఆర్ఆర్ అడ్మిన్ నోరు మూయించాడు.
బత్తాయి పవర్ చూపించిన కమిన్స్..
రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించిన వెంటనే వారి సెటైరికల్ పోస్ట్లకు అదిరిపోయే రీతిలో బదులిచ్చాడు. గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ ఒక్క పరుగుతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది. క్వాలిఫయర్-2లో మరోసారి రాజస్థాన్ రాయల్స్తో తలపడిన ఆరెంజ్ ఆర్మీ.. 36 పరగులతో గెలిచి ఫైనల్ చేరింది.
ఈ రెండు సందర్భాల్లోనూ రాజస్థాన్ రాయల్స్ను సన్రైజర్స్ దారుణంగా ట్రోల్ చేసింది. 'అమ్మ దీనమ్మ బత్తాయో..'అని రాజస్థాన్ రాయల్స్ అనుకునేలా కౌంటరిచ్చింది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 20 మ్యాచ్లు జరగ్గా.. సన్రైజర్స్ హైదరాబాద్ 11 విజయాలు సాధించింది. రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్లు మాత్రమే గెలిచింది.
సంజూ బ్యాటర్గానే..
ఆదివారం జరిగే మ్యాచ్లోనూ సన్రైజర్స్ హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్లతో సన్రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ భీకరంగా ఉంది. అంతేకాకుండా బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఉప్పల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండటం సన్రైజర్స్కు కలిసొచ్చే అంశం. మరోవైపు రాజస్థాన్ రాయల్స్.. రియాన్ పరాగ్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. సంజూ శాంసన్ కేవలం బ్యాటర్గా మాత్రమే బరిలోకి దిగనున్నారు.