టీమిండియా దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి'అనే మాటకు చక్కని ఉదాహారణ మహేంద్ర సింగ్ ధోనీ. చాలా సందర్భాల్లోనూ ఈ విషయం స్పష్టమైంది. టీమిండియా కెప్టెన్గా.. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా.. వ్యాపార వేత్తగా కోట్లు ఆర్జించినా ధోనీ సాధారణ మనిషిలానే కనిపిస్తాడు.
తన జట్టులోని ఆటగాళ్లందరినీ ఒకేలా చూస్తాడు. ఈ కారణంతోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడేందుకు క్రికెటర్లు ఆసక్తి కనబరుస్తుంటారు. ధోనీ సింప్లిసిటీకి సంబంధించిన ఓ సంఘటన ఇప్పుడు అతని అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కొన్నాళ్లు ధోనీ జట్టులో సాధారణ వికెట్ కీపర్గా కొనసాగాడు. ఆ సమయంలో విజయ్ హాజారే వంటి దేశవాళీ టోర్నీల్లో ధోనీ పాల్గొన్నాడు. ప్రస్తుత భారత ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రోహిత్, కోహ్లీ వంటి ఆటగాళ్లు విశ్రాంతి దొరికితే వెకేషన్కు వెళ్తున్నారు. కానీ అప్పట్లో ధోనీ సమయం దొరికినప్పుడల్లా దేశవాళీ క్రికెట్ ఆడేవాడు.
2017లో విజయ్ హాజారే ట్రోఫీలో ధోనీ బరిలోకి దిగాడు. కోల్కతాలో జరిగిన ఓ మ్యాచ్ కోసం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ ధోనీ ఒక్కడికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసింది. మిగతా ఆటగాళ్లందర్నీ రైలులో పంపించేందుకు సిద్దమైంది. ధోనీ స్టార్ ప్లేయర్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ముందుగా ధోనీకి ఈ విషయం చెప్పలేదు. దాంతో ప్రయాణానికి సిద్దమైన ధోనీ మిగతా ఆటగాళ్లు ఎక్కడా? అని జార్ఖండ్ అసోసియేషన్ ప్రతినిధులను ప్రశ్నించాడు. వారందరికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేందుకు తమ వద్ద బడ్జెట్ లేదని చెప్పారు. ఈ మాటతో షాక్ అయిన ధోనీ.. మిగతా ఆటగాళ్లతోనే ప్రయాణిస్తానని, వారందరూ వస్తేనే విమానం ఎక్కుతానని వాదించాడు.
లేకపోతే తనకు కూడా ట్రైన్ టికెట్ బుక్ చేయాలని కోరాడు. ధోనీని ఎంత కన్విన్స్ చేసిన వినలేదు. చివరకు ఫ్లైట్ టికెట్ను రద్దు చేసుకొని ధోనీ సహచర ఆటగాళ్లతో రైలులోనే ప్రయాణించాడు. ఆ ప్రయాణంలో ధోనీ తన సహచర ఆటగాళ్లతో ట్రైన్ టికెట్ కలెక్టర్గా పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నాడని అప్పట్లో జార్ఖండ్ ప్లేయర్లు మీడియాకు తెలియజేశారు.
ఆటగాళ్లందరినీ ధోనీ సమంగా చూస్తాడనేదానికి ఈ ఘటన పెద్ద ఉదాహారణనని, ప్రస్తుత ఆటగాళ్ల నుంచి ఇది ఏ మాత్రం ఆశించలేమని ధోనీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.