టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సాధించిన తొలి అంతర్జాతీయ శతకానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫిదా అయ్యాడు. టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టకుముందు గంభీర్.. తరుచూ విరాట్ కోహ్లీనే విమర్శించేవాడు. మైదానంలో ఈ ఇద్దరూ గొడవపడిన సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్లో రెండు సార్లు ఈ ఇద్దరూ కొట్టుకోవడానికి సిద్దమయ్యారు.
గత ఐపీఎల్ సీజన్లో ఇద్దరూ తమ గొడవలకు ఫుల్స్టాప్ పెట్టి ఒక్కటయ్యారు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కలిసి పని చేస్తున్నారు. మధ్యలో ఈ ఇద్దరు గొడవపడినా.. ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉండేవారు. ఢిల్లీకి చెందినవారే కావడంతో వారి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది.

కోహ్లీకి పెదన్నలా గంభీర్ వ్యవహరించేవాడు. కెరీర్ ఆరంభంలో అతనికి గంభీర్ అండగా నిలిచాడు. కోహ్లీ సాధించిన తొలి అంతర్జాతీయ శతకానికి ఫిదా అయ్యి తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందజేశాడు. 15 ఏళ్ల క్రితంలో 2009లో భారత్లో శ్రీలంక పర్యటించినప్పుడు నాలుగో వన్డేకు గాయంతో యువరాజ్ సింగ్ దూరమయ్యాడు.
ఆ సిరీస్లో బెంచ్ ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లీకి యువరాజ్ సింగ్ స్థానంలో అవకాశం దక్కింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పటి సహచర ఆటగాడు గౌతమ్ గంభీర్తో కలిసి సాధికారికంగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి శతకాన్ని అందుకున్నాడు. మూడో వికెట్కు ఈ ఇద్దరూ 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ కూడా శతకంతో రాణించాడు. అయితే యువ ప్లేయర్ అయిన కోహ్లీ శతకానికి ముగ్దుడైన గంభీర్ తనకు లభించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని అతనికి ఇచ్చేశాడు. కెరీర్లో మరింత ఉన్నత స్థానానికి చేరాలాని, ఇలానే నిలకడగా రాణించాలని అతన్ని ప్రోత్సహించాడు. ఆ శతకం తర్వాత కోహ్లీ వెనుదిరిగి చూడలేదు. జట్టులో తన స్థానాన్ని శాశ్వతం చేసుకున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లోనూ గంభీర్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. నేటితో కోహ్లీ 36వ ఏట అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతని అభిమానులు.. గంభీర్తో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు.