ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించాలనే టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కల కలగానే మిగిలిపోయింది. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ గెలవాలని సూర్యకుమార్ యాదవ్ భావించాడు. తద్వారా వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. కానీ ఆస్ట్రేలియా అనూహ్యంగా లీగ్ దశలోనే ఈ టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
పసికూన జింబాబ్వేతో పాటు శ్రీలంక చేతిలో ఓడిన ఆస్ట్రేలియా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-8 రేసు నుంచి తప్పుకుంది. జింబాబ్వే, ఐర్లాండ్ వేదికగా మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దాంతో జింబాబ్వే ఐదు, శ్రీలంక 6 పాయింట్లతో గ్రూప్-బీ నుంచి సూపర్-8 చేరాయి. దాంతో ఆసీస్ మెగా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

పొట్టి ప్రపంచకప్ చరిత్రలో లీగ్ దశలోనే ఆసీస్ వెనుదిరగడం ఇది రెండో సారి మాత్రమే. 2009 టీ20 ప్రపంచకప్లోనూ ఆసీస్ ఇలానే లీగ్ దశలోనే నిష్క్రమించింది. దాంతో ఫైనల్లో ఆసీస్ను ఓడించాలనే సూర్యకుమార్ యాదవ్ కల కలగానే మిగిలిపోయింది.
ఈ టోర్నీ షెడ్యూల్ ప్రకటన కార్యక్రమంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళల వన్డే కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో కలిసి సూర్యకుమార్ యాదవ్ పాల్గొన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో ఫైనల్ ప్రత్యర్థిగా ఎవరు ఉండాలని అనుకుంటున్నారు? అని సూర్యకుమార్ యాదవ్ను హోస్ట్ జతిన్ సప్రు ప్రశ్నించాడు. అందుకు సూర్య.. 'అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాను ఓడించాలనుకుంటున్నాం.'అని నవ్వుతూ బదులిచ్చాడు.
రోహిత్ శర్మ మాత్రం ఏ జట్టుతోనైనా పర్లేదని, కానీ భారత్ ఫైనల్ చేరాలని, విజేతగా నిలవాలని కోరుకుంటున్నానని తెలిపాడు. 'టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత్ ఫైనల్ చేరాలని కోరుకుంటున్నా. గతంలో జరిగిందేదో జరిగిపోయింది(వన్డే ప్రపంచకప్ ఓటమి). అదే స్టేడియంలో ఆస్ట్రేలియాను ఫైనల్లో ఓడించాలని సూర్య ఎంతో బాధతో చెప్పాడు. భారత్.. ఏ జట్టుతో ఫైనల్స్ ఆడినా.. విజేతగా చూడాలని కోరుకుంటున్నా.'అని ఇదే కార్యక్రమంలో రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా లీగ్ దశలోనే వెనుదిరగడంతో సూర్య వ్యాఖ్యలను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. పాపం సూరీడి కల నెరవేరలేదని కామెంట్ చేస్తున్నారు.