లార్డ్స్: యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెయిర్ స్టో ఔటైన తీరుపై దుమారం చెలరేగుతోంది. అనైతిక చర్యతో ఆసీస్ ఈ వికెట్ సాధించిందని మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడుతున్నారు. చివరి రోజు ఆటలో కామెరూన్ గ్రీన్ బౌన్సర్ను తప్పించుకునేందుకు బెయిర్ స్టో కిందకు వంగాడు.
బంతి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లోకి వెళ్లగా.. నాన్ స్ట్రైకర్ బెన్ స్టోక్స్ను కలిసేందుకు జానీ బెయిర్ స్టో క్రీజును వీడాడు. వెంటనే కీపర్ బంతిని వికెట్లకు కొట్టి గట్టిగా అప్పీల్ చేశాడు. బెయిర్స్టో పరుగు తీసేందుకు ప్రయత్నించలేదు కాబట్టి థర్డ్ అంపైర్ ఎరాస్మస్ నాటౌట్ అంటాడేమోనని అనుకున్నారు. కానీ బంతి డెడ్ కాలేదని భావించి బెయిర్స్టోను స్టంపౌట్గా ప్రకటించాడు.

నిబంధనల ప్రకారం ఔటైనా.. క్రీడా స్పూర్తికి విరుద్దమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. భారత అభిమానులు అయితే క్రీడా స్పూర్తికి కేరాఫ్ అడ్రస్ మహేంద్ర సింగ్ ధోనీ అని గుర్తు చేస్తున్నారు. 2011 ఇంగ్లండ్ పర్యటనలో ఆ జట్టు బ్యాటర్ ఇయాన్ బెల్ కూడా ఇలానే రనౌట్ అయితే ధోనీ అప్పీల్ను వెనక్కి తీసుకొని క్రీడా స్పూర్తిని చాటాడని అతని అభిమానులు గుర్తు చేస్తున్నారు.
ట్రెంట్ బ్రెడ్జ్ వేదికగా జరిగిన నాటి రెండో టెస్ట్ మూడో రోజు ఆట ఓ డ్రామాను తలిపించింది. టీ బ్రేక్ సమయం ముందు ఇషాంత్ శర్మ వేసిన 66వ ఓవర్ చివరి బంతిని నాటి ఇంగ్లండ్ బ్యాట్స్మన్ ఇయాన్ మోర్గాన్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా చక్కటి షాట్ ఆడాడు. దాదాపు బౌండరీ అనుకుంటుండగా.. ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న ప్రవీణ్ కుమార్ అద్భుత డైవ్తో బంతిని అడ్డుకున్నాడు.
అయితే అది ఫోరా? కాదా? అనే సందిగ్ధత నెలకొంది. ఈ లోపు ఇయాన్ బెల్, మోర్గాన్ మూడు పరుగులు పూర్తి చేశారు. అయితే అది టీ బ్రేక్ ముందు బంతి కావడం.. బౌండరీ పోయిందనే అలసత్వంతో ఇయాన్ బెల్ మూడో పరుగు తర్వాత నాలుగో రన్ కోసం సగం క్రీజు వరకు పరుగెత్తుకొచ్చి ఆగిపోయాడు.
ఇక బంతిని అందుకున్న ధోనీ తెలివిగా స్టంప్స్ను కొట్టి అప్పీల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా మైదానంలో అయోమయం చోటుచేసుకుంది.
అంపైర్లకు కఠిన సవాల్ ఎదురైంది. ముందుగా ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సాయంతో బంతి బౌండరీనా? కాదా? అని పరీక్షించారు. బంతి బౌండరీ వెళ్లలేదని తేలడంతో.. భారత ఫీల్డర్లు అప్పీల్ చేశారా? లేదా ? అని చెక్ చేశారు. వారు అప్పీల్ చేయడంతో మరోసారి ధోనీని ప్రశ్నించారు. అతను అప్పీల్ వెనక్కు తీసుకోవడానికి నిరాకరించడంతో నిబంధనల మేరకు ఇయాన్ బెల్ను రనౌట్గా ప్రకటించారు.
అయితే ఈ నిర్ణయంతో అవాక్కైన ఇయాన్.. ఓవర్ పూర్తయిందనే మాట విన్నానని, బెయిల్స్ కిందపడేయంతోనే ఆగిపోయానని అంపైర్లకు తెలుపుతూ అసంతృప్తితో మైదానం వీడాడు. ఇక ఇంగ్లండ్ అభిమానులు ఛీటర్స్ ఛీటర్స్ అంటూ పెద్దగా అరిచారు. ఆ అరుపుల మధ్యలో ఆటగాళ్లంతా టీ బ్రేక్కు వెళ్లారు.
ఇక టీ బ్రేక్ సమయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాటి ఇంగ్లండ్ కోచ్ అండీ ఫ్లవర్, కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ లు ఇండియా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఇయాన్ ఔట్ అప్పీలును ఉపసంహరించుకోవలసిందిగా ధోనీని కోరారు. తొలుత ససేమిరా అన్న ధోనీ.. టీమ్తో చర్చించి చెబుతానన్నాడు.
జట్టులోని సీనియర్లతో చర్చించిన మహీ.. ఇయాన్ బెల్ రనౌట్ అప్పీలును ఉపసంహరించుకున్నాడు. అయితే అప్పీల్ను ఉపసంహరించుకోవడానికి ధోనీ ససేమిరా అన్నాడని, సచిన్ చెప్పడంతోనే ఒప్పుకున్నాడని అప్పట్లో బ్రిటీష్ మీడియా పేర్కొంది.
అప్పీల్ను వెనక్కు తీసుకోవడంతో ఇయాన్ బెల్ క్రీజులోకి అడుగుపెట్టాడు. దీంతో ఇంగ్లండ్ అభిమానులు ధోనీని కొనియాడారు. క్రీడా స్పూర్తి చాటాడని హీరో అంటూ ప్రశంసించారు. బ్రిటీష్ మీడియా సైతం ధోనీ, భారత జట్టు నిర్ణయాన్ని ప్రశంసించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓడినా.. ధోనీని స్పిరిట్ ఆఫ్ ద క్రికెటర్ అవార్డుతో ఐసీసీ సత్కరించింది.