
బెంగళూరు: శ్రీలంకతో జరుగుతున్న డే/నైట్ టెస్ట్లో భారత బౌలర్లు దుమ్మురేపారు. పింక్ బాల్తో ప్రత్యర్థి జట్టును హడలెత్తించారు. 30 ఓవర్లలోనే 6 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా మహమ్మద్ షమీ తీసిన ఓ వికెట్ అయితే మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. శ్రీలంక ఇన్నింగ్స్ 6వ ఓవర్లోనే ఈ అద్భుతం చోటు చేసుకుంది. మహమ్మద్ షమీ వేసిన తన ఫస్ట్ ఓవర్ తొలి బంతికే శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణ రత్నే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పింక్ బాల్పై ఉండే ఎక్స్ట్రా సీమ్ను తనకు అనుగుణంగా మార్చుకున్న షమీ.. బంతి అద్భుతంగా టర్న్ చేశాడు. అతను వేసిన బాల్ ఆఫ్ స్టంప్ వెలుపల పడి టర్న్ అయ్యి నేరుగా వికెట్లను గిరాటేసింది.
కరుణ రత్నే బంతిని అంచనా వేసేలోపే అది గింగిరాలు తిరుగుతూ వికెట్లపైకి దూసుకుపోయింది. దాంతో అతని ఫ్యూజులు ఔటయ్యాయి. ఇదేం బంతిరా అయ్యా.. అంటూ కరుణరత్నే బిత్తరపోయాడు. ఆ జట్టులో కాస్తో కూస్తో బ్యాటింగ్ చేసే ప్లేయర్ ఎవరైనా ఉన్నారా? అంటే అది అతనే. కానీ షమీ జెమ్ ఆఫ్ డెలివరీ కారణంగా అతను నాలుగు పరుగులకే నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక మహమ్మద్ షమీ కెరీర్లో ఈ వికెట్ స్పెషల్గా నిలవనుంది. ఇక బంతిపై సీమ్ను ఉపయోగించి టర్న్ రాబట్టడంలో షమీని మించిన వారులేరు.
ఈ వికెట్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.షమీ బౌలింగ్కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇదో అద్భుతమైన బంతి అని కొనియాడుతున్నారు. వాటే డెలివరీ షమీ అని ఒకరంటే.. అతను బౌలింగ్ను చాలా ఎంజాయ్ చేస్తాడని, దానికి ఈ వికెటే నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు. ఇదొక సెన్సేషనల్ బాల్ అని ప్రశంసిస్తున్నారు.
సొంతగడ్డపై ఇంతకుముందు ఆడిన రెండు డే/నైట్ టెస్ట్లను వరుసగా 3, 2 రోజుల్లోనే ప్రత్యర్థులను చుట్టేసిన భారత్.. మూడో మ్యాచ్లోనూ అదే ఒరవడిని కొనసాగించేలా ఉంది. బ్యాటింగ్ చాలా కష్టంగా మారిన పరిస్థితుల్లో తొలి రోజు బ్యాట్తో, బంతితో సత్తా చాటింది. శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 92) మేటి ఇన్నింగ్స్ ఆడటంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 252 పరుగులు చేసింది. లంక బౌలర్లలో ఎంబుల్దేనియా (3/94), జయవిక్రమ (3/81), ధనంజయ డిసిల్వా (2/32) రాణించారు. అనంతరం జస్ప్రీత్ బుమ్రా (3/15), మహ్మద్ షమీ (2/18)ల ధాటికి లంక 86/6తో నిలిచింది. మాథ్యూస్ (85 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 43) చెప్పుకోదగ్గ ఒక్కడే ఇన్నింగ్స్ ఆడాడు. ఆట ఆఖరుకు డిక్వెలా (13), ఎంబుల్దేనియా (0) క్రీజులో ఉన్నారు.