బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నిర్వాహకులపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్ ట్రోఫీని ఆసీస్ లెజెండ్ అలెన్ బోర్డర్ ఒక్కడి చేతుల మీదుగానే ప్రదానం చేయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్ట్లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్ 3-1తో కైవసం చేసుకుంది. 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ట్రోఫీ అందుకుంది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అలెన్ బోర్డర్ చేతుల మీదుగా ఈ ట్రోఫీని అందుకున్నాడు.
ఆ సమయంలో సునీల్ గవాస్కర్ అక్కడే కామెంటేటర్గా ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాడు. ట్రోఫీని అందజేయడానికి తనను కూడా ఆహ్వానించి ఉంటే బోర్డర్తో కలిసి ఇచ్చేందుకు సంతోషించేవాడినని తెలిపాడు. తనను ఆహ్వానించకపోవడం నిరుత్సాహానికి గురిచేసిందన్నాడు.

'ఆస్ట్రేలియా సిరీస్ గెలిచింది. నేను ఇక్కడే ఉన్నా. వారు అద్భుతంగా ఆడారు కాబట్టి విజయం సాధించారు. ఆసీస్ గెలవడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. బోర్డర్తో కలిసి నేను కూడా టైటిల్ ప్రదానం చేస్తే బాగుండేది. నేను భారతీయుడిని కావడంతో నన్ను పిలవలేదు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే ట్రోఫీ అందజేతపై నిర్వాహకులు వారి అభిప్రాయాన్ని నాకు తెలియజేశారు. భారత్ ఈ మ్యాచ్ గెలవకపోయినా.. డ్రా అయినా నా అవసరం లేదన్నారు. నాకు బాధేం లేదు. కానీ ఇది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కదా.. ఇద్దరం కలిసి ఇస్తే బాగుండేది అనిపించింది.'అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
గవాస్కర్ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో బదులిస్తున్నారు. గవాస్కర్ చెప్పినదాంట్లో వాస్తవం ఉందని, అతన్ని పిలవాల్సిందని కొందరంటే.. సిరీస్ ఓడిపోయిన బాధలో ఉంటే.. ఈయన ట్రోఫీ అందజేస్తాడంట? అని మరికొందరు విమర్శించారు. ఇంకొందరు సెటైరికల్గా అలిగావా? గవాస్కర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
1996/97 సీజన్ నుంచి ఇరు దేశాల క్రికెట్ దిగ్గజాలు అయిన అలెన్ బోర్డర్, సునీల్ గవాస్కర్ పేరిట బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఐసీసీ నిర్వహిస్తోంది. యాషెస్ సిరీస్ మాదిరిగానే ఈ సిరీస్కు ఆదరణ లభించింది. 2016-17 నుంచి వరుసగా నాలుగుసార్లు(2018-19, 2020-21, 2022-23) బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. తాజా సీజన్లో మాత్రం ఆసీస్ విజేతగా నిలిచింది. మొత్తం 17 సిరీస్లు జరగ్గా.. భారత్ 10 సార్లు విజేతగా నిలిచింది. ఆసీస్ 6 సార్లు గెలవగా.. ఒక సిరీస్ డ్రా అయ్యింది.