న్యూఢిల్లీ: ఐపీఎల్ సంచలనం, కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ ఎట్టకేలకు టీమిండియా పిలుపును అందుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనకు పట్టించుకోని సెలెక్టర్లు చైనా వేదికగా జరగనున్న ఏషియన్ గేమ్స్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రింకూ సింగ్కు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనున్న ఏషియన్స్ గేమ్స్లో క్రికెట్ భాగమవ్వగా.. బీసీసీఐ తృతీయ శ్రేణి జట్టును ఎంపిక చేసింది.
ఏషియన్ గేమ్స్ ముగియక ముందే వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుండటంతో సీ టీమ్ను ఎంపిక చేశారు. ఈ జట్టు వివరాలను అజిత్ అగార్కర్ సారథ్యంలోని ఆలిండియా సెలెక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. రుతురాజ్ గైక్వాడ్ జట్టును నడిపించనుండగా.. ఐపీఎల్లో సత్తా చాటిన శివమ్ దూబే, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, ప్రభుసిమ్రాన్ సింగ్, జితేశ్ శర్మలు చోటు దక్కించుకున్నారు.

లెఫ్ట్ ఆర్మ పేసర్ అర్షదీప్ సింగ్, వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మకు కూడా అవకాశం దక్కింది. ఏషియన్ గేమ్స్లో చివరిసారిగా 2014లో క్రికెట్ భాగం కాగా.. అప్పుడు భారత జట్టు బరిలోకి దిగలేదు. ఈసారి కూడా బీసీసీఐ ససేమిరా అన్నా.. ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఇడియా ఒత్తిడితో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ తరఫున పురుషుల, మహిళ జట్లు పాల్గొంటున్నాయి.
రింకూ సింగ్పై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెలెక్టర్లే నివ్వెరపోయేలా చెలరేగాలని సూచిస్తున్నారు. ఇన్నాళ్లు ఎందుకు ఎంపిక చేయలేదని పశ్చాతాప పడేలా ఆడాలని కోరుకుంటున్నారు. మరోవైపు రింకూ సింగ్ కూడా భారత జట్టులో చోటు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశాడు. కేకేఆర్ నుంచి టీమిండియాకు ఎంపికవడాన్ని ప్రతిబింబించేలా.. రెండు జెర్సీల్లో ఉన్న ఫొటోతో 'ఫైనల్లీ' అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో రింకూ సింగ్ కేకేఆర్ తరఫున 14 మ్యాచ్ల్లో దాదాపు 150 స్ట్రైక్ రేట్తో 474 పరగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో వరుసగా ఐదు సిక్సులు కొట్టి జట్టును గెలిపించాడు. టీమిండియాకు ఎంపికవడం పట్ల రింకూ స్పందించాడు.
భారత జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షెహ్బాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభుసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).
స్టాండ్ బై ప్లేయర్లు:
యష్ థాకూర్, సాయి కిశోర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.