రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బ్యాటర్, టీమిండియా యువ ప్లేయర్ రజత్ పటిదార్ దుమ్మురేపుతున్నాడు. భారత్ ఏ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో సొంతగడ్డపై జరుగుతున్న అనధికారిక టెస్ట్లో రజత్ పటిదార్ ఫైటింగ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్లో 553/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్- ఏ చెత్త బ్యాటింగ్తో 95 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్స్ తుషార్ దేశ్పాండే, నవదీప్ సైనీతో రజత్ పటీదార్ ఒంటరి పోరాటం చేశాడు. తక్కువ స్కోర్కు ఆలౌటవ్వకుండా పరువు కాపాడాడు. తుషార్ దేశ్పాండే(23)తో కలిసి 8వ వికెట్కు 51 పరుగులు జోడించిన అతను.. నవదీప్ సైనీతో కలిసి 9వ వికెట్కు అజేయంగా 69 పరుగులు జోడించాడు.
ఇందులో సైనీ చేసింది 3 పరుగులే కావడం విశేషం. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 8 వికెట్లకు 215 పరుగులు చేసింది. క్రీజులో రజత్ పటీదార్(132 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్స్లతో 140 బ్యాటింగ్), నవ్దీప్ సైనీ(11 బంతుల్లో 3 బ్యాటింగ్) ఉన్నారు. ఇండియా-ఏ జట్టు ఇంకా 338 పరుగులు వెనుకంజలో ఉంది.
స్ట్రైకింగ్ ఎక్కువగా తీసుకున్న రజత్ పటిదార్ ధాటిగా ఆడుతూ వేగంగా పరుగులు చేశాడు. 89 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వరుసగా మూడు సిక్స్లు బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అనంతరం కూడా అదే జోరు కనబర్చాడు. అసాధారణ ప్రదర్శనతో జట్టును ఆదుకున్న రజత్ పటిదార్పై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి.
ఈ ఆర్సీబీ బ్యాటర్ను ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్కు ఎంపిక చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ది వాల్ రాహుల్ ద్రవిడ్కు నయా వాల్గా చతేశ్వర్ పుజారా రాణించాడని, అతని వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు రజత్ పటిదార్ సిద్దంగా ఉన్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ది వాల్ 3.o లోడింగ్ అంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.