జై షానే దేవుడు..
ప్రస్తుతం భారత క్రికెటర్లకు జై షానే దేవుడని, అతను కరుణిస్తేనే జట్టులో చోటు దక్కుతుందని, కన్నెర్ర చేస్తే ఎంతటి తోపు ఆటగాడైనా ఉద్వాసనకు గురవ్వాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జై షాను వ్యతిరేకించడంతోనే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కోల్పోయాడని, ఫామ్లోకి రావడంతో జట్టులో కొనసాగుతున్నాడని లేకుంటే జట్టు నుంచి కూడా పంపించేవాడని కోహ్లీ ఫ్యాన్స్ ఆరోపిస్తుంటారు. తాజాగా పృథ్వీ షా టీమిండియాకు ఎంపికవ్వడాన్ని కూడా అభిమానులు జైషాతో ముడిపెడుతూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. సాయి బాబాను నమ్ముకుంటే పృథ్వీ షా పని కాలేదని, అదే జై షాను కీర్తిస్తే జట్టులోనే చోటు దక్కించుకున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు.
ట్రిపుల్ సెంచరీతో..
ఇటీవల రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ బాదిన పృథ్వీ షాను జై షా ట్విటర్ వేదికగా అభినందించాడు. అసాధారణ బ్యాటింగ్తో అరుదైన రికార్డు అందుకున్న పృథ్వీ షాకు అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కు స్పందించిన పృథ్వీ షా ధన్యవాదాలు తెలుపుతూ.. జై షా మాటలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని, మరింత కష్టపడేలా చేస్తాయని పేర్కొన్నాడు. జై షాకు కృతజ్ఞతలు తెలపడంతోనే పృథ్వీ షా జట్టులోకి వచ్చాడని కామెంట్ చేస్తున్నారు. సాయిబాబాను ట్యాగ్ చేస్తే కానీ పని.. జై షాను ట్యాగ్ చేస్తే మాత్రం టీమిండిలోనే చోటు దక్కిందని ఓ యూజర్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.
సాయిబాబా ఫొటోలతో..
2021లో చివరిసారిగా ఆడిన పృథ్వీ షా.. పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. అప్పటి నుంచి రీఎంట్రీ కోసం ప్రయత్నించినా సెలెక్టర్లు పట్టించుకోలేదు. దేశవాళీ, ఐపీఎల్లో సత్తా చాటినా అవకాశం ఇవ్వలేదు. దాంతో సోషల్ మీడియా వేదికగా సాయిబాబా ఫోటోలు పెట్టి సెలక్టర్లపై పృథ్వీ షా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. గతేడాది ప్రధాన టోర్నీలు వదిలేసినా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ తో పాటు అంతకుముందు ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటనలలో పృథ్వీ షాకు అవకాశం లభించలేదు.
కరుణించాడంటూ..
దాంతో సోషల్ మీడియా వేదికగా సాయి బాబా ఫొటోను షేర్ చేసిన పృథ్వీ షా 'సాయిబాబా.. అంతా నువ్వు చూస్తూనే ఉంటావని ఆశిస్తున్నా.' అని షేర్ చేశాడు. అంతకుముందు కూడా .. 'ఎప్పుడూ నమ్మకాన్ని వదులుకోకండి.. అద్భుతాలు మీ మార్గంలోనే ఉన్నాయి'అని ట్వీట్ చేశాడు. సెలక్టర్లను ఉద్దేశించే పృథ్వీ షా ఇలా చేశాడని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు భావించారు. తనను అభినందించిన జై షాకు ధన్యవాదాలు తెలపడంతో సెలెక్టర్లు పృథ్వీ షాను కరుణించి ఎంపిక చేశారు. షాకు చోటు దక్కడంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికైనా సాయిబాబా అతడిని కరుణించాడని కామెంట్స్ చేస్తున్నారు. అయితే టీమ్లోకి వచ్చినా పృథ్వీకి తుది జట్టులో చోటు దక్కుతుందా..? లేదా..? అన్నది కాలమే తేల్చాలి.


Click it and Unblock the Notifications












