భారత క్రికెట్లో కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ శకం ముగిసింది. నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. ఐపీఎల్లో కొనసాగుతూ సారథిగా తన మహిమలు చూపించిన ధోనీ.. క్యాష్ రిచ్ లీగ్లో కూడా కెప్టెన్సీకి గుడ్బై చెప్పేసాడు. కెప్టెన్గా లీగ్ చరిత్రలోనే ఐదు టైటిళ్లు అందించిన ధోనీ.. అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్ చేర్చిన ఘనతను కూడా అందుకున్నాడు.
అరంగేట్ర సీజన్లోనే చెన్నైని ఫైనల్కు చేర్చిన ధోనీ.. మరో రెండేళ్లకు తొలి టైటిల్ అందించాడు. 2010, 2011 2018, 2021, 2023 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. 2008, 2012, 2013, 2015, 2019లో ధోనీ సారథ్యంలోని సీఎస్కే రన్నరప్గా నిలిచింది.

ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్ల పాటు సీఎస్కేపై నిషేధం పడగా.. ఆ సమయం మినహా ఐపీఎల్ కెరీర్ మొత్తాన్ని ఆ జట్టుతోనే కొనసాగించాడు. అనుకున్నదే తడువుగా సిక్సర్లు కొట్టి.. రెప్పపాటులో స్టంపింగ్స్ చేసి.. వికెట్లను చూడకుండానే రనౌట్లు చేసి.. అద్భుతాలు సృష్టించాడు. తన ఆటతో చెన్నై అభిమానుల మదిలో తలాగా నిలిచిపోయాడు.
ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. భారత క్రికెట్లో ఓ శకం ముగిసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్లో ఓ స్వర్ణ యుగం ముగిసిందని, ధోనీలాంటి కెప్టెన్ను మళ్లీ చూడలేమని ఏమోషనల్ అవుతున్నారు. ధోనీ పోస్ట్లను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇన్స్టాలో ధోనీతో షేక్ హ్యాండ్ తీసుకుంటున్న ఫొటోను షేర్ చేసి అతని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఏమోజీ పెట్టాడు.
చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న ధోనీ.. తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ పేరును ప్రకటించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనుంది. ఇక ఐపీఎల్లో ధోనీ తిరుగులేని రికార్డులు నమోదు చేశాడు.
ఇప్పటి వరకు 250 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన అతను 22 హాఫ్ సెంచరీలతో 5082 రన్స్ చేశాడు. 239 సిక్సర్లు బాదాడు. 243 మ్యాచ్ల్లో కీపింగ్ చేసిన ధోనీ 138 క్యాచ్లు, 42 స్టంపౌట్స్తో సత్తా చాటాడు.
కెప్టెన్గా 226 మ్యాచ్లు ఆడిన ధోనీ.. 4660 రన్స్ చేశాడు. ఇందులో 133 విజయాలు అందించాడు.