టీమిండియా బ్యాటర్లపై సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ఆటగాళ్లా? లేక గల్లీ క్రికెటర్లా? అని ప్రశ్నిస్తున్నారు. సౌతాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా 153 పరుగులకు కుప్పకూలింది. ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయింది. ఏకంగా ఏడుగురు బ్యాటర్లు ఖాతా తెరవకపోగా.. ఆరుగురు డకౌటయ్యారు.
ఓ దశలో 153/4 స్కోర్తో పటిష్టంగా కనిపించిన టీమిండియా.. అనంతరం 11 బంతుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లు కోల్పోయింది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా ఒక్క పరుగు చేయకుండా చివరి 6 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ చెత్త ఫీట్ సాధించిన జట్టుగా టీమిండియా అప్రతిష్టను మూటగట్టుకుంది.

టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 46), శుభ్మన్ గిల్(55 బంతుల్లో 5 ఫోర్లతో 36), రోహిత్ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లతో 39) మినహా అంతా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్(8) ఒక్కడే ఖతా తెరవగా మిగతా ఆరుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా(0), జస్ప్రీత్ బుమ్రా(0), మహమ్మద్ సిరాజ్(0), ప్రసిధ్ కృష్ణ(0) డకౌటవ్వగా.. ముఖేష్ కుమార్కు బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు.
ఈ పేలవ బ్యాటింగ్పై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం బ్యాటింగ్ రా అయ్యా.. అంటూ మండి పడుతున్నారు. గల్లీ క్రికెటర్ల అయినా కనీసం ఒక్క పరుగైనా చేస్తారని సెటైర్లు పేల్చుతున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. టాయిలెట్ వెళ్లొచ్చే లోపే ఆలౌటయ్యారని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి బ్యాటింగ్ మరీ దారుణమని, ఒక్క పరుగు తీయకపోవడం ఏంటని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్యాటింగ్ చూసి నమ్మలేకపోతున్నామని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్(6/15) ఆరు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించగా... జస్ప్రీత్ బుమ్రా(2/25), ముఖేష్ కుమార్(2/0) రెండేసి వికెట్లతో రాణించారు.
సఫారీ బ్యాటర్లలో డేవిడ్ బెడింగ్హమ్(12), కైల్ వెర్రెయన్(15) మాత్రమే రెండెంకల స్కోర్ చేశారు. ఫస్ట్ సెషన్లోనే సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది.