ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్(SRH) తమ పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. శనివారం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. చెత్త బౌలింగ్, స్లో బ్యాటింగ్.. లాక్ ఆఫ్ ప్లానింగ్ సన్రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాయి.
ముఖ్యంగా బౌలింగ్ విభాగం ప్రదర్శన తీవ్ర నిరాశకు గురి చేసింది. 219 పరుగుల భారీ స్కోర్ చేసినా సన్రైజర్స్ హైదరాబాద్ కాపాడుకోలేకపోయింది. కనీసం పంజాబ్ కింగ్స్ బ్యాటర్ల జోరుకు బ్రేకులు వేసేందుకు కూడా ప్రయత్నించలేదు. స్పిన్నర్లు శివాంగ్ కుమార్, హర్ష్ దూబే మినహా అంతా చేతులెత్తేసారు. ప్రతీ ఓవర్లో బౌండరీలు, సిక్సర్లు సమర్పించుకున్నారు.

సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఆ జట్టు ఓనర్ కావ్యమారన్ ముఖం చాటేసినట్లు ప్రచారం జరుగుతోంది. సన్రైజర్స్కు సంబంధించిన ప్రతీ మ్యాచ్కు హాజరయ్యే కావ్య మారన్.. శనివారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కనిపించలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టీవీ కెమెరామెన్స్ కూడా కావ్య మారన్ను సూచించలేదు. తనను చూపించవద్దని బ్రాడ్కాస్టర్స్ను కావ్య మారన్ కోరినట్లు ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
జట్టు ప్రదర్శన పట్ల కావ్య మారన్ సిగ్గుతో ముఖం చాటేస్తుందని సెటైర్లు పేల్చుతున్నారు. ఇంత చెత్త బౌలింగ్తో టోర్నీలో రాణించడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. జట్టు ప్రక్షాళన చేయాల్సిన ఆసన్నమైందని, ముఖ్యంగా సపోర్ట్ స్టాఫ్ మొత్తాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సైతం.. తమ బౌలింగ్ టీమ్పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తే ఏం చేయలేమని అసహనం వ్యక్తం చేశాడు. 'మేం బౌలింగ్లో దారుణంగా విఫలమయ్యాం. సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయలేకపోయాం. టీ20 క్రికెట్లో సరైన చోట బంతులు వేయడం చాలా ముఖ్యం. ఈ విషయంలో ఈరోజు మేం వెనకపడ్డాం.
వాస్తవానికి 219 స్కోర్ మంచిదే. మరీ ముఖ్యంగా ఆరు ఏడుగురు బౌలర్లు జట్టులో ఉన్నప్పుడు ఈ స్కోర్ను కాపాడుకోవచ్చు. కానీ ప్రత్యర్థి బ్యాటర్ల ఆటకు తగ్గట్లు బౌలింగ్ చేయాలి. అలా చేయలేక మూల్యం చెల్లించుకున్నాం. మా బౌలింగ్ ప్రణాళికలు కూడా సరిగ్గా లేవు. మ్యాచ్ మధ్యలో ఏం చేయలేం. మ్యాచ్కు ముందే మంచి బౌలింగ్ వ్యూహాలతో బరిలోకి దిగాలి.'అని ఇషాన్ కిషన్ అసహనం వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో కొనసాగుతోంది. సోమవారం ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో సన్రైజర్స్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.