ఐదు టీ20ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టీ20కి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రాకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించామని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సందర్భంగా వెల్లడించాడు. విశ్రాంతి పేరిట బుమ్రాను పక్కనపెట్టడంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మ్యాచ్కే విశ్రాంతి ఏంటని? ప్రశ్నిస్తున్నారు.
విశ్రాంతి పేరిట బుమ్రాను తప్పించారని మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా టీమ్మేనేజ్మెంట్ నిర్ణయంపై సెటైర్లు పేల్చుతున్నారు. ఫన్నీ మీమ్స్తో నవ్వులు పూయిస్తున్నాయి. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్కు దూరంగా ఉన్న బుమ్రా.. టీ20 సిరీస్లో ఒక్క మ్యాచ్కే పక్కన పెట్టడం ఏంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్క్లోడ్ మేనేజ్ చేయడానికి బుమ్రా ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేశాడని, కేవలం 3 ఓవర్లకే బుమ్రా అలసిపోయాడా? అని మండిపడుతున్నారు.

వరల్డ్ క్లాస్ పేసర్ బుమ్రాతో వాటర్ మోపించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన హర్షిత్ రాణాను ఆడించేందుకు వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనే సాకుతో బుమ్రాను తప్పించారని కొందరు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్షర్ పటేల్ గాయంతో జట్టుకు దూరమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుపుతున్నారు. అక్షర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. దాంతో బ్యాటింగ్ డెప్త్ లేకుండా పోతుందని గ్రహించిన టీమ్మేనేజ్మెంట్ బుమ్రాను పక్కనపెట్టి హర్షిత్ రాణాను ఆడిస్తుందని ఆరోపిస్తున్నారు.
వర్క్లోడ్ మేనేజ్మెంట్తో ఇలానే బుమ్రాను పక్కనపెడితే మ్యాచ్ ప్రాక్టీస్ లేక అతను రిథమ్ కోల్పోయే ప్రమాదం ఉందని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో అన్ని మ్యాచ్లను ఆడించాలని సూచిస్తున్నారు. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో బుమ్రా మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 29 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ తీయలేకపోయాడు. అతని బౌలింగ్లో చాప్మన్ ఇచ్చిన క్యాచ్ను రింకూ సింగ్ నేలపాలు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ 48 పరుగుల తేడాతో విజయం సాధించి ఐదు టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.