మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను పాకిస్థాన్ వణికించింది. బుధవారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దాంతో ఆస్ట్రేలియా 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ కాసేపటికే కిమ్ గార్త్ కూడా ఔటవ్వడంతో ఆసీస్ ఆలౌట్ తప్పదని అంతా అనుకున్నారు. కానీ టెయిలండర్ అలానా కింగ్(49 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 51 నాటౌట్) సాయంతో బెత్ మూనీ(114 బంతుల్లో 11 ఫోర్లతో 109)అసాధారణ శతకంతో జట్టును కాపాడింది.
ఈ ఇద్దరూ 9వ వికెట్కు 106 పరుగులు జోడించారు. దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో నష్రా సంధు(3/37) మూడు వికెట్లు తీయగా.. రమీన్ షమీమ్(2/29), ఫాతిమా సనా(2/49) రెండేసి వికెట్లు పడగొట్టారు. డయాన బైగ్, సదియా ఇక్బాల్ చెరో వికెట్ పడగొట్టారు. బెత్ మూనీ సెంచరీతో ఆసీస్ ఈ మ్యాచ్లో పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. ఈ పోరాట ఇన్నింగ్సే లేకుంటే పాకిస్థాన్ బౌలర్ల ధాటికి ఆసీస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకునేది. పాకిస్థాన్ బౌలర్లపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఈ మ్యాచ్లో పాకిస్థాన్ గెలిచినా.. గెలవకున్నా బౌలర్లు మాత్రం అసాధారణ ప్రదర్శన కనబర్చారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు బెత్ మూనీ, అలనా కింగ్ పోరాటాన్ని కూడా కొనియాడుతున్నారు. అసాధారణ ప్రదర్శనతో ఛాంపియన్ టీమ్ సత్తా ఏంటో చూపించారని, ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని ప్రశంసిస్తున్నారు.
ఈ టోర్నీలో పాకిస్థాన్ ఒక్క విజయం నమోదు చేయలేదు. బంగ్లాదేశ్, భారత్ చేతిలో ఘోర పరాజయాలను చవిచూసిన పాకిస్థాన్.. ఆసీస్తోనైనా గెలవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారని, బ్యాటర్లు తమ వంతు సత్తా చాటాలని సూచిస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్పై ఆసీస్ గెలవగా.. శ్రీలంతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. పాకిస్థాన్పై గెలిచి పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలవాలని ఆసీస్ భావిస్తోంది.