టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్.. ఫ్రాంచైజీ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్) 2025లో సెంట్రల్ ఢిల్లీ తరఫున సెహ్వాగ్ తనయుడు బరిలోకి దిగాడు. బుధవారం ఈస్ట్ ఢిల్లీ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో తండ్రి తరహాలోనే ఓపెనర్గా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్యవీర్ సెహ్వాగ్.. దూకుడైన బ్యాటింగ్తో దుమ్మురేపాడు.
ఆరంభంలో కాస్త నర్వస్గా కనిపించిన ఆర్యవీర్.. తొలి 4 బంతుల్లో సింగిల్ మాత్రమే తీసాడు. ఆ తర్వాత నవ్దీప్ సైని బౌలింగ్లో వరుసగా డీప్ ఎక్స్ట్రా కవర్, ఎక్స్ట్రా కవర్ దిశగా బౌండరీలు బాది రిథమ్ అందుకున్న ఆర్యవీర్.. చూడముచ్చటైన షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆ మరుసటి ఓవర్లోనూ రెండు బౌండరీలు బాదాడు. 16 బంతుల్లోనే 22 పరుగులు చేసి క్రీజులో సెట్ అయిన ఆర్యవీర్.. తండ్రిలానే అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. తక్కువ పరుగులకే వెనుదిరిగినా.. అతని ఫియర్లెస్ అప్రోచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ మ్యాచ్లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ 62 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సెంట్రల్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. యుగల్ సైనీ(52), జస్వీర్ సెహ్రావత్(37 నాటౌట్), ఆర్యవీర్ సెహ్వాగ్(22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ 16 ఓవర్లలో 93 పరుగులే చేసి ఘోర పరాజయం చవిచూసింది. ఆర్యవీర్ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రూ. 8 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆర్యవీర్ సెహ్వాగ్ బ్యాటింగ్పై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'ఆడి కొడుకు వచ్చాడని చెప్పు'అని కామెంట్ చేస్తున్నారు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ తన ఫేవరేట్ క్రికెటర్స్ అని ఆర్యవీర్ సెహ్వాగ్ తెలిపాడు. సచిన్, రోహిత్, ధోనీ కన్నా తనకు శుభ్మన్ గిల్, కోహ్లీనే ఇష్టమని చెప్పాడు. సచిన్ తన తండ్రి ఫేవరేట్ అయినప్పటికీ తాను మాత్రం కోహ్లీనే ఆరాధిస్తానని స్పష్టం చేశాడు.
తన తండ్రి ఆడే సమయంలో ఢిల్లీ వేదికగా జరిగే మ్యాచ్లకు హాజరయ్యేవాడినని ఆర్యవీర్ గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్కు ఆడే సమయంలో ప్రతీ మ్యాచ్కు వచ్చేవాడినని తెలిపాడు. ఢిల్లీలోని ట్రాఫిక్ కారణంగా ఓ మ్యాచ్లో తన తండ్రి బ్యాటింగ్ను చూడలేకపోయానని గుర్తు చేసుకున్నాడు. 'నా తొలి జ్ఞాపకం.. ఢిల్లీ వేదికగా జరిగే అన్ని మ్యాచ్లను నేను చూసేవాడిని. ముఖ్యంగా మా డాడీ ఢిల్లీ డేర్డేవిల్స్కు ఆడే సమయంలో తరుచుగా వెళ్లేవాడిని.
నేను మరిచిపోలేని విషయం ఏంటంటే.. ఢిల్లీకి డాడీ ఆడుతున్నప్పుడు ట్రాపిక్ కారణంగా నేను ఆయన బ్యాటింగ్ చూడలేకపోయాను. నా చిన్నప్పటి నుంచే నేను ప్లాస్టిక్ బ్యాట్, బాల్తో ఆడేవాడిని. నా సోదరుడితో కలిసి చాలా క్రికెట్ ఆడాను. డాడీ ఆటను చూడటం వల్లే క్రికెట్పై మక్కువ పెరిగింది. మా నాన్న నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.'అని ఆర్యవీర్ సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.