క్రికెటర్ గాడ్ సచిన్ టెండూల్కర్ నిష్క్రమణ తర్వాత అతన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు? వరల్డ్ బెస్ట్ బ్యాటర్ అయిన సచిన్ను భర్తీ చేయడమా? అసాధ్యం అనుకున్నారంతా! మూడు ఐసీసీ టైటిళ్లతో కెప్టెన్సీకి పర్యాయపదంగా నిలిచిన ధోనీ రిటైర్మెంట్ తర్వాత.. జట్టును నడిపించేదెవరు? అదీ కష్ట సాధ్యమే అని తేల్చేశారందరూ! కానీ ఈ రెండు లక్ష్యాలనూ ఒక్కడే అందుకున్నాడు. అతనే విరాట్ కోహ్లీ! అసాధారణ ఆటతో తరానికొక్కడిగా నిలిచాడు! ఇప్పుడు కోహ్లీ కూడా నిష్క్రమించాడు. అతన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అయితే కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగల దమ్మున్న ఆటగాడు భారత జట్టులోనే ఉన్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే అతను కోహ్లీ తరహాలో అద్భుతమైన విజయాలు అందించాడని గుర్తు చేస్తున్నారు. టాప్ బ్యాటర్లు ఔటైన వేళ జట్టును కాపడటానికి ఒక కాపరిలా మారాడని, ఆరంభానికి ముగింపుకు మధ్య వారధిలా నిలిచాడని కామెంట్ చేస్తున్నారు.

తన లోపాన్ని బలంగా మార్చుకొని.. జట్టు పడిపోతున్న ప్రతీసారి నేనుంటానని నమ్మకాన్ని కలిగించాడని, పెద్దగా గుర్తింపు దక్కకపోయినా.. జట్టును ఆదుకోవడానికి అతను ఎప్పుడూ ముందుంటాడని, జట్టు ప్రయోజనాలే ముఖ్యంగా నిస్వార్థంగా ఆడుతాడని గుర్తు చేస్తున్నారు. అతను ఎవరో కాదు... టీమిండియా నెంబర్ 4 బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అని చెబుతున్నారు.
అవును విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఈ ఢిల్లీ ఆటగాడికే ఉందని మెజార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే అతనికి అవకాశాలు ఇచ్చి అండగా నిలవాల్సిన బాధ్యత బీసీసీఐ ఉందని చెబుతున్నారు. మూడు ఫార్మాట్లలో రాణించడమే కాకుండా.. టీమిండియాను నడిపించే సామర్థ్యం కూడా శ్రేయస్ అయ్యర్కు ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చిన శ్రేయస్ అయ్యర్.. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. 2 హాఫ్ సెంచరీలు.. రెండు 40 ప్లస్ స్కోర్లతో 243 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. బ్యాటర్గా.. కెప్టెన్గా సత్తా చాటుతున్నాడు. అతన్ని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసి నెంబర్ 4 ఆడిస్తే కోహ్లీ లేని లోటును పూడ్చుతాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.