ఇదే రోజు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు:
గతేడాది ఇదే రోజు (జులై 10) యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ సహా మరే టోర్నీలేవీ ఆడనని వెల్లడించాడు. యువరాజ్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి నేటికి ఏడాది. ఈ వీడ్కోలును గుర్తుచేసుకుంటూ అభిమానులు 'మిస్ యూ యువీ' ట్యాగ్తో అతడిని తలుచుకుంటున్నారు. మరోవైపు తమిళనాడు ఎమ్మెల్యే జే అన్బళగన్ వైరస్ కారణంగా ఈ రోజే మృతి చెందారు. ఆయన జన్మదినమూ ఈ రోజే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన అభిమానులు 'రెస్ట్ ఇన్ పీస్' ట్యాగ్లైన్తో ట్వీట్లు చేస్తున్నారు. ఈ రెండు ట్యాగ్లైన్లు ఒకేసారి ట్రెండ్ అవుతున్నాయి.
మిస్ యూ యువీ:
ప్రస్తుతం యువరాజ్ సింగ్, జే అన్బళగన్ ట్యాగ్లైన్లు ఒకేసారి ట్రెండ్ అవుతున్నాయి. ‘మిస్ యూ యువీ' కిందే ‘రెస్ట్ ఇన్ పీస్' ట్యాగ్లైన్ ఉండటంతో ట్విటర్లో కలవరం మొదలైంది. దీంతో యువీ ఫాన్స్ ఎంతో భయపడ్డారు. ఇప్పటికే ఈ ఏడాదిలో ఊహించని విపత్తులను ఎదుర్కొంటున్న కారణంగా బయపడ్డామని చాలా మంది ఫాన్స్ ట్వీట్ చేశారు. ఇక అసలు విషయం తెలుసుకున్న అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. రిటైర్మెంట్ ప్రకటించి నేటికి ఏడాది పూర్తయినా ఇంకా అభిమానుల గుండెల్లో 'యువరాజు'గానే ఉన్నాడు సిక్సర్ల వీరుడు. టీమిండియాలో ట్రబుల్ షూటర్గా ప్రసిద్ధి చెందిన యువరాజ్ ఇలా మరోమారు ట్విటర్లో ట్రెండింగ్లో నిలిచాడు.
క్యాన్సర్పై విజయం సాధించి:
2019 జూన్ 10న యువరాజ్ సింగ్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ భారత్ గెలవడంతో యువీ కీలక పాత్ర పోషించాడు. 19 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ఫినిషర్గా, ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్మన్గా.. ఆల్రౌండర్గా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. యువీ క్యాన్సర్పై విజయం సాధించి అందరికీ ప్రేరణగా నిలిచాడు. అదే మహమ్మారితో బాధపడుతున్న చిన్నారులకు తన ఫౌండేషన్ ద్వారా సాయం అందిస్తున్నాడు.
304 వన్డేలు.. 8701 పరుగులు:
యువీ మొత్తం భారత్ తరఫున 40 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు చేసాడు. ఇక 58 టీ20 మ్యాచ్లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.