బెల్గ్రేడ్: నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీకి దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నాడని సమాచారం తెలుస్తోంది. న్యూయార్క్లో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో.. ఒకవేళ టోర్నీ ప్రేక్షకులు లేకుండా జరిగినా కూడా సెర్బియా స్టార్ పాల్గొనకూడదనుకుంటున్నాడట. ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జకోవిచ్ ఇలా సంకేతాలిచ్చాడు.
తాజాగా నోవాక్ జకోవిచ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'నేను మాట్లాడిన చాలా మంది ప్లేయర్లు టోర్నీ జరిగే న్యూయార్క్ వెళ్లేందుకు సుముఖంగా లేరు. ప్రస్తుతం అక్కడ తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. టోర్నీ జరుగుతుందని నేను భావించడం లేదు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. సెప్టెంబర్లో ఫ్రెంచ్ ఓపెన్తోనే టెన్నిస్ పోటీలు పునఃప్రారంభం కావొచ్చు అని' అని ఆశాభావం వ్యక్తం చేసాడు.
షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 31న యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రా ప్రారంభం కావాల్సి ఉంది. టోర్నీని ప్రేక్షకులు లేకుండా నిర్వహించేందుకు యూఎస్ ఓపెన్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కరోనా కారణంగా ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ రద్దు కాగా, ఫ్రెంచ్ ఓపెన్ సెప్టెంబర్కు వాయిదా పడిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా రెండు నెలలు స్పెయిన్లో చిక్కుకుపోయిన జాకో.. ఇటీవలే స్వదేశం సెర్బీయాకు చేరుకున్నాడు.
జూన్ 13 నుంచి జులై 5వరకు బాల్కన్స్లో తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'ఆడ్రియా టూర్' నిర్వహిస్తున్నాడు జకోవిచ్. ఆడ్రియా టోర్నీని ప్రభుత్వ నిబంధనలకు లోబడే నిర్వహించేలా ప్లాన్ చేసాడు. ఈ టోర్నీలో జాకోతో పాటు మరో ముగ్గురు టాప్ ఆటగాళ్లు ఆడతారు. డొమినిక్ థీమ్, గ్రిగొర్ డిమిత్రోవ్, అలెగ్జాండర్ జ్వరెవ్ ఆడ్రియా టోర్నీలో పాల్గొంటారు.
ప్రపంచ టెన్నిస్ నంబర్వన్ నోవాక్ జొకోవిచ్ కరోనా పోరుపై ఇప్పటికే తన సహృదయతను చాటుకున్నాడు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్పై పోరాడేందుకు తన వంతు సాయం ప్రకటించాడు. జొకోవిచ్ 1.1 మిలియన్ డాలర్ల (రూ.8.28 కోట్లు) భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు, శానిటరీ వస్తువులను కొనుగోలు చేయడానికి ఇంత మొత్తాన్ని సెర్బియా ప్రభుత్వానికి విరాళం ఇచ్చినట్టు జొకో తెలిపాడు.
పక్షిని కాపాడిన ఎంఎస్ ధోనీ.. ఆపై ఏం జరిగిందంటే?!!