ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ నుంచి మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా అనూహ్యంగా నిష్క్రమించింది. పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. పసికూన జింబాబ్వే చేతిలో చిత్తయిన ఆసీస్.. ఆ తర్వాత శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. ఇక జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య పల్లెకెలె మైదానం వేదికగా మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది.
దాంతో గ్రూప్-బీ నుంచి శ్రీలంక, జింబాబ్వే సూపర్-8కు అర్హత సాధిస్తే ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా ఇలా లీగ్ దశలోనే నిష్క్రమించడం ఇది మూడోసారి. 2009 టీ20 ప్రపంచకప్తో పాటు 2022 టీ20 ప్రపంచకప్లోనూ ఆసీస్ లీగ్ దశలోనే వెనుదిరిగింది.
ఆసీస్ పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ వుడ్ వంటి స్టార్ పేసర్లు గాయాలతో జట్టుకు దూరమవడంతో ఆ జట్టు బౌలింగ్ విభాగం బలహీనంగా మారిందని, స్పిన్నర్ ఆడం జంపా వైఫల్యం జట్టు పతనాన్ని శాసించిందని కొందరు చెబుతుంటే.. గతంలోలా కొత్త తరం ఆటగాళ్లను క్రికెట్ ఆస్ట్రేలియా సిద్దం చేసుకోలేకపోయిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇంకొందరు మాత్రం మిచెల్ మార్ష్ బలుపుతోనే ఆసీస్ పతనం మొదలైందని కామెంట్ చేస్తున్నారు. 2023 వన్డే ప్రపంచకప్ గెలిచాక మిచెల్ మార్ష్ ట్రోఫీపై కాళ్లు పెట్టుకోవడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ట్రోఫీపై అతను కాళ్లు పెట్టిన ఫొటో అప్పట్లో నెట్టింట వైరల్గా మారింది. ట్రోఫీ విలువ తెలియక ఆసీస్ ఆటగాళ్లు బలుపు చూపిస్తున్నారని భారత నెటిజన్లు అప్పట్లో తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే తమ ఆట ముందు ట్రోఫీ కూడా చిన్నదేనని ఆసీస్ ఆటగాళ్లు అప్పట్లో బదులిచ్చారు. కానీ ఈ బలుపే వారికి శాపంగా మారిందని ప్రస్తుత నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఆ ఘటన తర్వాత ఆసీస్.. ఒక్క ఐసీసీ టోర్నీలో కూడా మెరుగైన ప్రదర్శన చేయలేదని గుర్తు చేస్తున్నారు. 2024 టీ20 ప్రపంచకప్లోనూ ఆసీస్ సెమీస్ చేరలేదు. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్ చేతిలో టెస్ట్ మ్యాచ్ ఓడింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓటమిపాలైంది.
డబ్ల్యూటీసీ 2025 ఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. పాకిస్థాన్, శ్రీలంక, సౌతాఫ్రికా జట్లతో వన్డే సిరీస్ల్లో ఓటమిపాలైంది. తాజా టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే చేతిలో ఓటమిపాలవ్వడంతో పాటు లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రపంచకప్ టైటిల్ను మిచెల్ మార్ష్ అవమానించడంతోనే ఆస్ట్రేలియాకు శాపం తగిలిందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.