లక్నో సూపర్ జెయింట్స్ యువ స్పిన్నర్ దిగ్వేష్ రతిపై వేటు పడింది. అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కఠిన చర్యలు తీసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం జరిగిన మ్యాచ్లో దిగ్వేష్ రతి అతిగా ప్రవర్తించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మను ఔట్ చేసిన అనంతరం వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు. తన ట్రేడ్ మార్క్ నోట్బుక్ సెలెబ్రేషన్స్ చేసుకునే క్రమంలో అభిషేక్ శర్మను బయటకు వెళ్లాలంటూ సైగలు చేశాడు.
దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అభిషేక్ శర్మ.. దిగ్వేష్ రతితో గొడవకు దిగాడు. 'జుట్టు పట్టి కొడతా'అంటూ సైగలు చేశాడు. దాంతో దిగ్వేష్ రతి కూడా అతనివైపు దూసుకొచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా అంపైర్లు జోక్యం చేసుకుని గొడవ ఆపారు. మ్యాచ్ అనంతరం ఈ ఇద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకున్నారు. ఐపీఎల్ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన ఈ ఇద్దరిపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. అభిషేక్ శర్మ మ్యాచ్ ఫీజులోని 25 శాతం కోత విధించారు.

అయితే ఈ ఘటన జరిగిన వెంటనే రిషభ్ పంత్.. దిగ్వేష్ రతిని మందలించాడు. ఎందుకింత వైల్డ్ రియాక్ట్ అవుతున్నావ్, ప్రశాంతంగా ఉండాలని సూచించాడు. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా సైతం దిగ్వేష్ రతితో మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. ఈ ఫొటోలను షేర్ చేస్తున్న అభిమానులు.. 'తమ్ముడూ.. ఎందుకింత బలుపు?'అని ప్రశ్నిస్తున్నారు. 'నీ ఆట కంటే నీ అతి సంబరాలే వార్తల్లో నిలుస్తున్నాయి'అని కామెంట్ చేస్తున్నారు.
ప్రియాన్ష్ ఆర్య వికెట్తో..
దిగ్వేష్ రతిపై ఐపీఎల్ నిర్వాహకులు చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్యను ఔట్ చేసిన అనంతరం దిగ్వేష్ రతి తొలి సారి నోట్ బుక్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. దూకుడుగా ఆడిన ప్రియాన్ష్ ఆర్యను క్యాచ్ ఔట్ చేసిన వెంటనే అతని దగ్గరకు పరుగెత్తి నోట్బుక్లో రాసుకుంటున్నట్లుగా సంబరాలు చేసుకున్నాడు. ఈ సంబరాలను తప్పుబడుతూ.. ఫీల్డ్ అంపైర్.. దిగ్వేష్ రతికి వార్నింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ అనంతరం అతని మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ చర్యలు తీసుకున్నారు. అయినా అతను వెనక్కి తగ్గలేదు.
పిచ్పై రాస్తూ..
ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లోనూ నమన్ దీర్ను ఔట్ చేసి మళ్లీ నోట్ బుక్ సంబరాలు చేసుకున్నాడు. మళ్లీ అతని మ్యాచ్ ఫీజులో కొత పడటంతో నోట్ బుక్ సంబరాలను కాస్త మార్చుకున్నాడు. పిచ్పై రాసుకుంటున్నట్లు సంబరాలు చేసుకుంటున్నాడు. ఈ సీజన్లో దిగ్వేష్ రతి.. అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, అనికేత్ వర్మ, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, నమన్ ధీర్, సునీల్ నరైన్, జోస్ బట్లర్లను ఔట్ చేసి ఇలానే నోట్బుక్ సంబరాలు చేసుకున్నాడు. మధ్యలో కాస్త తగ్గినా.. మళ్లీ నోట్ బుక్ సెలెబ్రేషన్స్ చేసుకొని వేటుకు గురయ్యాడు.