ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, టీమిండియా సారథి రోహిత్ శర్మ.. ఐపీఎల్లో మరో సెంచరీ నమోదు చేశాడు. చాలా కాలం తర్వాత ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ(63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్లతో 105 నాటౌట్) అజేయ శతకంతో రాణించాడు.
అయితే క్రీజులో అజేయంగా నిలిచిన తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన చెన్నై 20 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది.

రోహిత్ శర్మ వల్లే ఓటమి
ఈ క్రమంలోనే అతను ఈ శతకాన్ని సెలెబ్రేట్ కూడా చేసుకోలేదు. ఇతర ఆటగాళ్ల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో సూపర్ సెంచరీ బాదినా రోహిత్ ఏం చేయలేకపోయాడు. అయితే అతని ఒంటరి పోరాటాన్ని మెచ్చుకోవాల్సింది పోయి కొందరు అభిమానులు అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
రోహిత్ శర్మ సెల్ఫిష్ సెంచరీ కారణంగానే ముంబై ఇండియన్స్ ఓటమిపాలైందని ఆరోపిస్తున్నారు. టీ20ల్లో 63 బంతులు ఆడి 105 పరుగులు చేయడం ఘోర తప్పిదమని కామెంట్ చేస్తున్నారు.

కోహ్లీని సైతం..
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 61 బంతుల్లో సెంచరీ చేసినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ముఖ్యంగా అతని స్ట్రైక్రేట్ను విశ్లేషిస్తూ చాలా మంది అభిమానులు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్.. విరాట్ కోహ్లీ శతకాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేశారు.
ఈ ఒక్కసారే కాదు.. విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ప్రతీసారి సెల్ఫీష్ ఇన్నింగ్స్ అంటూ విమర్శలు గుప్పించారు. రోహిత్ శర్మ సైతం జట్టు విజయానికి అవసరం లేని ఎన్ని పరుగులైనా వృథానేనని, ఘనతలు, రికార్డ్స్ ఎందుకు పనికిరావనీ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.

కోహ్లీ కంటే సెల్ఫిష్
ఈ క్రమంలోనే కోహ్లీ శతకం సెల్ఫీష్ అయినప్పుడు రోహిత్ శర్మ సెంచరీ అంతకంటే స్వార్థపూరితమైనదని కొందరు అభిమానులు వాదిస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆటగాళ్ల అభిమానుల వల్ల భారత క్రికెట్ సర్వనాశనం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన అతని ఫ్యాన్స్.. భారత ఆటగాడనే విషయాన్ని మరిచి కూడా ట్రోల్ చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. మ్యాచ్ల సందర్భంగా ఎగతాళి చేస్తూ.. అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు.
సర్వనాశనం..
వారికితోడుగా కొంతమంది సంకుచిత ఎక్స్పర్ట్స్, మాజీ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా చేసే తప్పిదాలను భూతద్దంలో పెట్టి చూస్తున్నారని, గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా ఇలానే విమర్శలు గుప్పించేవారని నెమరు వేసుకుంటున్నారు. భారత క్రికెట్లో జట్టు కంటే ఆటగాళ్ల వ్యక్తి పూజ ఎక్కువైందని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.