హైదరాబాద్: వెస్టిండీస్ గడ్డపై పరుగుల మోత మోగిస్తున్న టీమిండియా యువ ప్లేయర్, తెలుగు తేజం తిలక్ వర్మపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తిలక్ వర్మ చాలా మెచ్యూరిటీగా బ్యాటింగ్ చేస్తున్నాడని మాజీ క్రికెటర్లు అభినందిస్తున్నారు. వసీం జాఫర్ అయితే అతన్ని వన్డే జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.
కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రాకుంటే తిలక్ వర్మను ఆసియాకప్ 2023 టోర్నీ ఎంపిక చేయాలని సూచించాడు. నెటిజన్లు సైతం తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్ను కొనియాడుతున్నారు. వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. (39, 51, 49 నాటౌట్) వరుసగా మూడు మ్యాచ్ల్లో రాణించాడు.

69.50 యావరేజ్ 139 స్ట్రైక్రేట్తో 139 పరుగులు చేశాడు. తిలక్ వర్మ ఆడింది మూడు మ్యాచ్లే అయినా.. క్లిష్ట పరిస్థితుల్లో మెచ్యూర్గా బ్యాటింగ్ చేయడం అందర్నీ ఆకట్టుకుంది. జట్టులోని ఆటగాళ్లంతా విఫలమైన వేళ బ్యాట్ను ఝులిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే కొందరు అభిమానులు.. తిలక్ వర్మను మాజీ క్రికెటర్ సురేశ్ రైనాతో పోల్చుతున్నారు.
రైనా గణంకాలు.. తిలక్ వర్మ లెక్కలు ఒకే విధంగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఐపీఎల్లో తొలి రెండు సీజన్లలో సురేశ్ రైనా 350+ రన్స్ చేయగా.. తిలక్ వర్మ కూడా తన తొలి రెండు సీజన్లలో 350+ రన్సే చేశాడని గుర్తు చేస్తున్నారు.
20 ఏళ్ల వయసులో సురేశ్ రైనా టీ20ల్లోకి అరంగేట్రం చేస్తే.. తిలక్ వర్మ కూడా ఇదే వయసులో అరంగేట్రం చేశాడని పేర్కొంటున్నారు. అరంగేట్ర మ్యాచ్లో సురేశ్ రైనా రెండు క్యాచ్లు తీసుకుంటే.. తిలక్ వర్మ కూడా రెండే క్యాచ్లు అందుకున్నాడని గుర్తు చేస్తున్నారు.
క్లిష్ట సమయంలో రైనా అరంగేట్ర హాఫ్ సెంచరీ నమోదు చేస్తే.. తిలక్ వర్మ కూడా అదే చేశాడని, నెంబర్4లో అందరికి గుర్తుండిపోయేలా రైనా 49 పరుగులతో అజేయంగా నిలిస్తే.. తిలక్ వర్మ కూడా ఇది రిపీట్ చేశాడని పేర్కొంటున్నాడు. ప్రస్తుతం ఈ పొలిక నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.