టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ కళ్లు చెదిరే బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ షాట్స్తో అలరించాడు. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. జోష్ టంగ్ స్టన్నింగ్ డెలివరీకి కేఎల్ రాహుల్ క్రీన్ బౌల్డ్ కావడంతో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. వచ్చి రావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
వికెట్ తీసిన జోష్ టంగ్ బౌలింగ్లో.. అదే ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. జోష్ టంగ్ వేసిన మరుసటి ఓవర్లో మరో 4, 6 బాదాడు. అయితే ఈ ఓవర్లో అతను కొట్టిన సిక్స్ ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతిని రిషభ్ పంత్ స్వీప్ షాట్తో ఫైన్ లెగ్ దిశగా సిక్సర్ తరలించాడు.ఈ షాట్కు జోష్ టంగ్ అవాక్కవ్వగా.. కామెంటేటర్లు ఫిదా అయ్యారు. రిషభ్ పంత్ను ప్రత్యేకంగా అభినందించారు. నెటిజన్లు అయితే ఈ షాట్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'రిషభ్ పంత్.. ఏం గుండెరా నీది'అంటూ అతని ధైర్యాన్ని కొనియాడుతున్నారు.

బెన్ స్టోక్స్ బౌలింగ్లో 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిషభ్ పంత్ ఇచ్చిన సునాయస క్యాచ్ను జాక్ క్రాలీ నేలపాలు చేశాడు. జోష్ టంగ్ బౌలింగ్లో 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పంత్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను క్రిస్ వోక్స్ అందుకోలేకపోయాడు. ఈ రెండు అవకాశాలతో అతను చెలరేగాడు. దాంతో 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు శుభ్మన్ గిల్ కూడా 57 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్ భారీ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే భారత్ ఆధిక్యం 408 పరుగులు ధాటింది.