ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ ఫేవరేట్స్లో ఒకటిగా కనిపించింది. డిఫెండింగ్ రన్నరప్ హోదాతో పాటు విధ్వంసకర బ్యాటర్లు జట్టులో ఉండటంతో ఆరెంజ్ ఆర్మీ ఈ సారి టైటిల్ గెలవడం పక్కా అని అంతా అనుకున్నారు. అందరి అంచనాలకు తగ్గట్లుగానే సన్రైజర్స్ హైదరాబాద్.. తొలి మ్యాచ్లోనే 286 పరుగుల రికార్డ్ స్కోర్తో భారీ విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో సన్రైజర్స్ హైదరాబాద్కు తిరుగులేదని, పరుగుల రికార్డులన్నీ బద్దలవుతాయని ఫ్యాన్స్ భావించారు.
ఈ సారి సన్రైజర్స్ హైదరాబాద్ 300 పరుగుల రికార్డ్ అందుకుంటుందని కూడా ధీమా వ్యక్తం చేశారు. 300 లోడింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశారు. కానీ ఆ తర్వాత జరిగిన నాలుగు మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అనూహ్య పరాజయాలను ఎదుర్కొంది. తొలి మ్యాచ్లో అదరగొట్టిన హైదరాబాద్ బ్యాటర్లు, ఆ తర్వాత జరిగిన నాలుగు మ్యాచ్ల్లో తేలిపోయారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాంత్ కిషాన్, నితీశ్ కుమార్ రెడ్డి,హెన్రిచ్ క్లాసెన్ వంటి అరవీర భయంకరమైన బ్యాటర్లు బౌండరీలు బాదేందుకు తడబడ్డారు.

అభిషేక్ శర్మ సెంచరీతో..
బ్యాటింగ్ వైఫల్యానికి బౌలింగ్ విభాగం కూడా తోడవ్వడంతో సన్రైజర్స్ పరాజయాల పరంపర కొనసాగింది. అయితే పంజాబ్ కింగ్స్తో జరిగిన ఐదో మ్యాచ్లో మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు జూలు విధిల్చారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసంతో 246 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
దాంతో ఆరెంజ్ ఆర్మీ అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. జట్టు ఫామ్లోకి వచ్చిందని, ఇక నుంచి ప్రత్యర్థులకు దబిదిబిడేనని కామెంట్ చేశారు. ముంబై ఇండియన్స్తో వాంఖడే వేదికగా జరిగే మ్యాచ్లో 300 పక్కా అంటూ హల్ఛల్ చేశారు. అభిమానులను మరింత రెచ్చగొట్టేలా మాజీ క్రికెటర్లు సైతం 300 పక్కా అంటూ పోస్ట్లు పెట్టారు.
డేల్ స్టేయిన్.. రోస్ట్
సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ క్రికెటర్ కమ్ కోచ్, సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టేయిన్.. అయితే రాసి పెట్టుకొండి ఏప్రిల్ 17న ఐపీఎల్లో 300 స్కోర్ నమోదవుతుందని MI vs SRH మ్యాచ్ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. కానీ ఈ మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. 17వ ఓవర్ వరకు ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయారు. దాంతో ఈ మ్యాచ్లో 162 పరుగులే చేసిన సన్రైజర్స్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ పరాజయం నేపథ్యంలో డేల్ స్టేయిన్ను నెటిజన్లు ఆడుకుంటున్నారు. జస్ట్ 138 రన్స్ దూరంలో 300 మిస్సైందని సెటైర్లు పేల్చుతున్నారు. కొందరైతే ఇంకోసారి 300 పరుగులు అంటే మూతి పగులుద్ది అని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. జట్టు నిండా విధ్వంసకర బ్యాటర్లున్నా.. సరైన స్ట్రోక్ ప్లేయర్ లేడనేది వాస్తవం. పరిస్థితులకు తగ్గట్లు ఆడే సోయి కూడా ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లకు లేదు.
సోయి లేకుండా ఆడుతూ..
నిన్న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్లే అనవసర షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. సన్రైజర్స్ బ్యాటర్ల ఉరుకులాటకు తగ్గట్లు వైడ్ యార్కర్స్, స్లోయర్, కట్టర్స్ సంధించిన ముంబై ఇండియన్స్ ఆశించిన ఫలితం రాబట్టింది. ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ విభాగం అయితే మరీ నాసిరకంగా తయారైంది. మహమ్మద్ షమీ వైఫల్యం జట్టు కొంపముంచుతోంది. గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ లోస్కోరింగ్ గేమ్స్లో కూడా విజయం సాధించింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్నికూడా ఆ జట్టు కాపాడుకుంది. కానీ ఇప్పుడు 200 పరుగులు చేసినా.. గెలుస్తామనే గ్యారెంటీ లేదు. సరైన బౌలర్లు లేకపోవడమే ఇందుకు కారణం.
సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్,నటరాజన్, మార్కో జాన్సెన్ వంటి స్టార్ బౌలర్స్ను హైదరాబాద్ జట్టు వేలంలో వదులుకుంది. కానీ బ్యాటర్ల మోజులో పడి వారిని భర్తీ చేసే ఆటగాళ్లను తీసుకోలేకపోయింది. ఏది ఏమైనా 300 పరుగుల మోజులో పడి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సర్వ నాశనం అవుతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.