టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఇటీవల రోహిత్ శర్మ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. జాతీయ జట్టుకు ఆడని సమయంలో ఫిట్గా ఉంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు. చెప్పినట్లుగానే రోహిత్.. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కు హాజరై కుర్రాళ్లందరికి ఓ ఉదాహరణగా నిలిచాడు.
ముంబై వర్సెస్ విదర్భ మధ్య వాంఖడే వేదికగా జరుగుతున్న రంజీ ఫైనల్ మ్యాచ్కు రోహిత్ హాజరయ్యాడు. ఐపీఎల్ ముందు అతనికి దొరికిన విశ్రాంతి సమయాన్ని తన రంజీ టీమ్తో గడిపేందుకు సిద్దమైన రోహిత్పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రంజీ ఫైనల్ మ్యాచ్కు వ్యాఖ్యానం చేస్తున్న కామెంటేటర్లు సైతం రోహిత్ను ప్రశంసించారు.

రోహిత్ శర్మలాంటి దిగ్గజ ఆటగాళ్లు వచ్చి దేశవాళీ క్రికెట్కు మద్దతు తెలిపితే.. కుర్రాళ్ల ప్రదర్శన మరింత మెరుగువుతుందని అభిప్రాయపడ్డారు. ఇటీవలే బీసీసీఐ సైతం దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని ఆటగాళ్లందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బీసీసీఐ సూచనలను పట్టించుకోని ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ల కాంట్రాక్ట్లను తొలగిస్తూ కఠిన చర్యలు తీసుకొంది.
ధర్మశాల టెస్ట్కు ముందు దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వడంపై రోహిత్ సైతం కీలక వ్యాఖ్యలు చేశాడు. 'సుదీర్ఘ కాలంగా దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. జాతీయ జట్టుకు దూరంగా ఉండి ఫిట్గా ఉన్న ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలి. అది భారత క్రికెట్కే మంచిది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
విదర్భతో జరుగుతున్న ఫైనల్లో ముంబై విజయం దిశగా దూసుకెళ్తోంది. రెండో ఇన్నింగ్స్లో 418 పరుగులకు ఆలౌటవ్వడంతో విదర్భ ముందు 538 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. ఈ లక్ష్యచేధనకు దిగిన విదర్భ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయినా.. తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించిన ముంబై విజేతగా నిలవనుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటైంది. అనంతరం విదర్భ 105 పరుగులకే కుప్పకూలింది.