న్యూఢిల్లీ: వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. అందరి మనసులు గెలుచుకున్నాడు. తన చర్యతో భారత జాతీయపతాక ప్రాముఖ్యతను ప్రపంచానికి పరిచయం చేశాడు. నీరజ్ చోప్రా చేసిన ఈ పని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. ప్రతీ భారతీయుడు నీరజ్ చోప్రాకు సెల్యూట్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
హంగేరిలోని బుడాపెస్ట్ వేదికగా ఆదివారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్లో నీరజ్ చోప్రా.. ఈటెను 88.17 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ గెలుపుతో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ విజయానంతరం ఓ హంగేరి మహిళ నీరజ్ చోప్రాను ఆటోగ్రాఫ్ కావాలని కోరింది.

అయితే ఆమెకు అవగాహన లేక భారత జాతీయ పతకంపై సైన్ చేయాలని అడిగింది. వెంటనే నీరజ్ చోప్రా భారత జాతీయపతాక ప్రాముఖ్యత, గౌరవాన్ని వివరిస్తూ.. జెండాపై సైన్ చేయరాదని చెప్పాడు. అనతరం ఆమె స్లీవ్పై సైన్ చేశాడు. నీరజ్ చోప్రా ఆటోగ్రాఫ్తో సదరు అభిమాని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైంది.
నీరజ్ చోప్రా చేసిన పనికి ఫిదా అయిన భారత అభిమానులు.. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో గెలిచిన స్వర్ణాన్ని దేశానికి అంకితమిస్తున్నట్లు నీరజ్ చోప్రా ప్రకటించాడు. దేశంలోని ప్రతీ ఒక్క భారతీయుడి తనకు అండగా నిలిచారని, వారందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పాడు.
'ప్రతీ ఒక్క భారతీయుడికి కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నా. ఎందుకంటే అర్థరాత్రి వరకు మెళకువగా ఉండి నాకు మద్దతు తెలిపారు. ఈ బంగారు పతకం వారికే అంకితం. నేను ముందుగా ఒలింపిక్ ఛాంపియన్ అయ్యాను. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్గా నిలిచాను. భారతీయులు ఏదైనా చేయగలరు. కష్టపడటమే మాత్రమే మాకు తెలుసు.'అని చెప్పుకొచ్చాడు.