న్యూజిలాండ్తో తొలి వన్డే సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు వింత అనుభవం ఎదురైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా వడోదర వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లను బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) వినూత్నంగా సన్మానించింది. వడోదర వేదికగా ఇదే తొలి పురుషుల వన్డే మ్యాచ్ కావడంతో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఈ మ్యాచ్కు ఐసీసీ ఛైర్మన్ జై షాతో పాటు బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా హాజరయ్యారు. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో కోహ్లీ, రోహిత్ శర్మల ఫొటోలతో కూడిన ఒక కప్ బోర్డును మైదానంలోకి తీసుకొచ్చారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పేర్లను మైక్లో అనౌన్స్ చేయగానే అందులో నుంచి ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు బయటకు వచ్చారు. ఇది చూసి అక్కడున్న పెద్దలతో పాటు ఆటగాళ్లు, అభిమానులు, ప్రేక్షకులు అవాక్కయ్యారు.

బయటకు వచ్చిన కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీఏ ప్రతినిధులు పూల బొకేలను అందించారు. ఈ వినూత్న సన్మానానికి కోహ్లీ, రోహిత్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఒకర్ని ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. అనంతరం కప్ బోర్డుపై తమ ఫొటోలపై సంతకాలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇదెక్కడి సన్మానం రా అయ్యా'అని ఒకరంటే.. 'ఇదేందయ్యా ఇది.. నేను ఏడా చూడలే'అని మరొకరు కామెంట్ చేశారు.
ఈ మ్యాచ్కు 35 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఈ మ్యాచ్ టికెట్లు కేవలం 8 నిమిషాల్లోనే అమ్ముడైన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఆసాంతం కోహ్లీ, రోహిత్ నామస్మరణతో వడోదర స్టేడియం దద్దరిల్లింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగుల భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్(71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 84), డెవాన్ కాన్వే(67 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 56), హెన్రీ నికోల్స్(69 బంతుల్లో 8 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/40), హర్షిత్ రాణా(2/65), ప్రసిధ్ కృష్ణ(2/60) రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు.