టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. థ్యాంక్యూ సంజూ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్లు పెడుతున్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా చెన్నై వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో సంజూ శాంసన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. 15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 24 పరుగులే చేసినా.. గత ఐదు మ్యాచ్ల్లో టీమిండియాకు దక్కని ఆరంభాన్ని అందించాడు.
ముఖ్యంగా డకౌట్ల బాధ నుంచి టీమిండియాను గట్టెక్కించాడు. ఈ మ్యాచ్కు ముందు జరిగిన ఐదు మ్యాచ్ల్లో నాలుగు సార్లు ఓపెనర్లు డకౌటయ్యారు. ఇందులో అభిషేక్ శర్మ మూడు సార్లు డకౌటైతే.. సౌతాఫ్రికాతో మ్యాచ్లో ఇషాన్ కిషన్ సున్నాకే వెనుదిరిగాడు.
తాజా మ్యాచ్లో సంజూ శాంసన్ బాధ్యత తీసుకోని ధాటిగా ఆడటంతో అభిషేక్ శర్మ క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త సమయం లభించింది. ఆ తర్వాత అతను కూడా చెలరేగడంతో తొలి వికెట్కు 3.4 ఓవర్లలోనే 48 పరుగుల భాగస్వామ్యం లభించింది. ఈ మెగా టోర్నీలో సంజూకు ఇది రెండో మ్యాచ్ మాత్రమే. నమీబియాతో మ్యాచ్లోనూ ఇదే తరహాలో ఆడిన సంజూ.. తాజా మ్యాచ్లోనూ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు.

ఈ టోర్నీలో ప్రత్యర్థి జట్లు తెలివిగా.. పవర్ ప్లేలో ఎడమచేతి వాటం బ్యాటర్లు అయిన ఇషాన్, అభిషేక్, తిలక్లకు ఆఫ్ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం ద్వారా పరుగులు చేయకుండా కట్టడి చేసింది. దాంతో కుడిచేతి వాటం బ్యాటరైన శాంసన్ను ఆడించడం ద్వారా ఈ సమస్య అధిగమించవచ్చని టీమిండియా మేనేజ్మెంట్ భావించింది. అందులో భాగంగానే రింకూ సింగ్ను తప్పించి సంజూను ఓపెనర్గా ఆడించింది. మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని సంజూ నిలబెట్టుకున్నాడు.
భారీ స్కోర్ చేయకపోయినా.. తన వంతుగా జట్టుకు అందించాల్సిన సహకారం అందించాడు. ఈ క్రమంలోనే నెటిజన్లు అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం.. సంజూ తన బాధ్యతను నిర్వర్తించాడని ఎక్స్ వేదికగా కొనియాడాడు. 'ఏ ఓపెనర్ డకౌట్ అవ్వలేదు.. థ్యాంకూ సంజూ.. భారత్ను గట్టెక్కించావ్'అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
'ఈ ప్రపంచకప్ సైకిల్లో సంజూ, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా కొనసాగారు. ఇప్పుడు ప్రపంచ కప్ టైటిల్ను నిలబెట్టుకోవాల్సిన కీలక సమయంలో భారత్ మళ్లీ ఈ జోడీనే ఎంచుకుంది. 'అని ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా ట్వీట్ చేశాడు. జట్టు స్కోర్ను సంజూ సిక్సర్తో మొదలు పెట్టడాన్ని కూడా నెటిజన్లు కొనియాడుతున్నారు. సంజూ ఔటైనా.. ఇషాన్తో కలిసి అభిషేక్ శర్మ చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలోనే భారత్ 80/1 స్కోర్ చేసింది. ఈ టోర్నీలోనే టీమిండియాకు ఇది అత్యధిక పవర్ ప్లే స్కోర్ కావడం గమనార్హం.