
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. గత ఐదు ఇన్నింగ్స్ల్లో 12, 5, 48, 1, 12తో దారుణంగా విఫలమైన కింగ్ కోహ్లీ.. లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దుష్మంత్ చమీరా వేసిన ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని బ్యాక్వర్డ్ పాయింట్ ఫీల్డర్ మీదుగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి నేరుగా దీపక్ హుడా చేతిలో పడింది. శరీరానికి దూరంగా ఆడుతూ విరాట్ ఔటవ్వడం ఇదే తొలిసారి కాదు. గత మూడేళ్లుగా ఈ సమస్యతో అతను బాధపడుతున్నాడు. ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్లో అతను ఎక్కువ సార్లు ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్కే వెనుదిరిగాడు. అయినా ఈ సమస్యకు పరిష్కారం కనుగోలేకపోతున్నాడు.
చమీరా వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ఓవర్ ఐదో బంతికే బౌండరీతో జోరు కనబర్చిన యువ ఓపెనర్ అనూజ్ రావత్(4) క్యాచ్ ఔట్గా వెనుదిరగ్గా.. ఎన్నో అంచనాల మధ్య కోహ్లీ బరిలోకి దిగాడు. కానీ ఆ ఓవర్ చివరి బంతికే వికెట్ ఇచ్చుకొని తన అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాడు. విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్గా వెనుదిరగడాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఓ చాంపియన్ ప్లేయర్ ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటాడని ఊహించలేదని, తమ అభిమాన క్రికెటర్ను ఇలా చూసి తట్టుకోలేకపోతున్నామని కామెంట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడటం నరకంలా ఉందని మరో అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికీ విరాట్ ఔటయ్యాడంటే నమ్మలేకపోతున్నామని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక ఇదే అదునుగా భావించిన విరాట్ హేటర్స్ అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. విరాట్ పనైపోయిందని, రిటైర్మెంట్ ప్రకటించాలని ట్రోల్ చేస్తున్నారు.
7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్వెల్తో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గాడిన పెట్టే ప్రయత్నం చేసాడు. చమీరా వేసిన మూడో ఓవర్లో మ్యాక్స్ వెల్ రెండు బౌండరీలు ఓ సిక్స్ బాదగా.. డుప్లెసిస్ ఓ ఫోర్ కొట్టాడు. దాంతో ఆ ఓవర్లో 19 పరుగులొచ్చాయి. జోరు మీదున్న మ్యాక్స్వెల్ను కృనాల్ పెవిలియన్ చేర్చడంతో పవర్ ప్లేలో ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 47 రన్స్ చేసింది.