రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది అభిమానులు స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిలాసట జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులతో పాటు ఓ మహిళ ఉన్నారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అనూహ్య ఘటనతో ఆర్సీబీ సంబరం చిన్నబోయింది.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీపై నెటిజన్లు మండిపడుతున్నారు. సరైన భద్రతా ఏర్పాట్లు చేయకుండా విజయోత్సవ వేడుకలు నిర్వహించిన ఆర్సీబీపై చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆర్సీబీని రెండేళ్ల పాటు నిషేధం విధించాలని కూడా కోరుతున్నారు.

కోహ్లీని అరెస్ట్ చేస్తారా?
మరికొందరు ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో పుష్ప సినిమా సందర్భంగా తొక్కిసలాటలో ఒకరు మరణిస్తే ఆ సినిమా హీరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారని, ఇప్పుడు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేసే దమ్ముందా? అని ప్రశ్నిస్తున్నారు. విరాట్ కోహ్లీని చూసేందుకే అభిమానులు తరలి వచ్చారని, ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం విరాట్ కోహ్లీనేనని వాదిస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగినా.. ఆర్సీబీ తమ వేడుకలను జరుపుకుందని, వారికి అభిమానుల ప్రాణాలు అంటే లెక్కలేదని మండిపడుతున్నారు.
ఇది ప్రభుత్వ వైఫల్యమే..
మరికొందరు మాత్రం కర్ణాటక ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రచార ఆర్భాటంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించిందని, దాంతోనే ఈ విషాదకర ఘటన చోటు చేసుకుందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అత్యుత్సాహం ప్రదర్శించారని, ఓ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిననే సోయి మరిచి.. ఓ సాధారణ అభిమానిలా వ్యవహరించారని విమర్శిస్తున్నారు. గత 17 ఏళ్లుగా ఐపీఎల్ విజయోత్సవ వేడుకలు జరిగాయని, టీ20 ప్రపంచకప్ విజయానంతరం ముంబైలో కూడా ఇంత కంటే పెద్ద విజయోత్సవ వేడుకలు నిర్వహించారని, ఎప్పుడూ ప్రాణ నష్టం జరగలేదని గుర్తు చేస్తున్నారు.
ఈ తొక్కిసలాటకు పోలీసుల భద్రతా వైఫల్యమే ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికారులు అత్యుత్సాహంతో ఈ వేడుకల్లో పాల్గొనడంతో పోలీసులు వారి చుట్టే భద్రత కల్పించారని, అభిమానుల భద్రతను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. తొక్కిసలాట ప్రత్యక్ష సాక్షుల ప్రకారం స్టేడియం వద్ద పోలీసులు చాలా తక్కువగా ఉన్నారనే విషయం అర్థమవుతోంది. ఏది ఏమైనా ఆర్సీబీ విజయం.. 11 మంది చావుకు కారణమైందని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.