శ్రేయస్ అయ్యర్.. గత 6 ఐపీఎల్ సీజన్లలో నాలుగు సార్లు కెప్టెన్సీ చేస్తే అందులో మూడు సార్లు మూడు వేర్వేరు జట్లను టాప్-2లో నిలబెట్టాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మూడు జట్లను క్వాలిఫయర్-1కు చేర్చిన తొలి కెప్టెన్గా చరిత్రకెక్కాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన టీమ్ మ్యాచ్ గెలవాలనే కోరిక కన్నా చరిత్ర సృష్టించాలనే బాధ్యత తీసుకున్నాడు. 11 ఏళ్లుగా ప్లే ఆఫ్స్ అంటే తెలియని పంజాబ్ కింగ్స్ను అగ్రస్థానంలో నిలబెట్టాడు.
ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. ఇండియన్ ప్లేయర్లు షైన్ అయితేనే లీగ్లో అసలైన విజయం దక్కుతుందని అనుకున్నాడు. ప్రతీ జట్టులో ఒకరో ఇద్దరో అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉంటారు. కానీ పంజాబ్ కింగ్స్.. ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లతో ఆడుతూ టాప్ పోజిషన్కు వచ్చింది. ఇంతమంది యంగ్స్టార్స్ను స్టార్స్గా మార్చిన శ్రేయస్ అయ్యర్, పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్కు హ్యాట్సాఫ్.

దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లో నిలకడగా పరుగులు చేస్తున్నా.. సూపర్ ఫామ్లో ఉన్నా.. శ్రేయస్ అయ్యర్కు భారత జట్టులో చోటు ఉండు. ఎన్ని మ్యాచ్లు గెలిచినా.. ఎంత కెప్టెన్సీ చేసినా.. భారత జట్టుకు సారథ్యం వహించే అన్నీ అర్హతలు ఉన్నా.. కెప్టెన్సీ కోసం కనీసం అతని పేరును కూడా సెలెక్టర్లు పరిశీలించరు. అతని ఆటకు ఎలివేషన్స్ ఇస్తూ డబ్బా కొట్టే పీఆర్లు లేకపోవచ్చు.. తన గురించి ఎవరూ పెద్దగా మాట్లాడకపోవచ్చు. కానీ అతను టీమ్ను నడిపించే విధానం.. సాధించిన విజయాలే గట్టిగా మాట్లాడుతాయి. మాట్లాడుతున్నాయి కూడా..!
ఐపీఎల్ 2025 సీజన్లో శ్రేయస్ అయ్యర్ 14 మ్యాచ్ల్లో 51.40 సగటుతో 514 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉండగా.. స్ట్రైక్రేట్ 171.91 కావడం విశేషం. కెప్టెన్గా 14 మ్యాచ్ల్లో 9 విజయాలు అందించిన అయ్యర్.. ఓ మ్యాచ్ రద్దుతో 19 పాయింట్స్తో పంజాబ్ను టేబుల్ టాపర్గా నిలబెట్టాడు. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీని నెటిజన్లు కొనియాడుతున్నారు.
గతంలో రోహిత్ శర్మ ఐపీఎల్ సక్సెస్ను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. శ్రేయస్ అయ్యర్ విషయంలో ఎందుకు వివక్ష చూపుతుందని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్సీ దేవుడెరుగు.. సూపర్ ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్కు భారత టెస్ట్ జట్టులో చోటు లేకపోవడం ఏంటో? తమకు అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ కంటే మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లు ఎవరని ప్రశ్నిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ గనుక పంజాబ్ కింగ్స్కు ఐపీఎల్ టైటిల్ అందిస్తే.. అతన్ని టీమిండియా తదుపరి కెప్టెన్ చేయాలనే డిమాండ్ మరింత గట్టిగా వినిపించనుంది.