రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయోత్సవ సంబరాలు విషాదంగా ముగిసాయి. చిన్న స్వామి స్టేడియానికి లక్షలాది మంది అభిమానులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 11 మంది మరణించగా.. 50 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. క్రికెట్పై ఉన్న పిచ్చితో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం దారుణమని నెటిజన్లు మండిపడుతున్నారు. విజయోత్సవ వేడుకల్లో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఆర్సీబీ ఫ్రాంచైజీ బాధ్యతారాహిత్యం కూడా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ దురదృష్టకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆర్సీబీ ఆదుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఐపీఎల్ 2025 సీజన్ విజేతగా నిలవడంతో వచ్చిన రూ. 20 కోట్ల ప్రైజ్మనీని మృతుల కుటుంబ సభ్యులకు అందజేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు. కోట్లు పెట్టినా పోయిన ప్రాణాలను తీసుకురాలేమని, కనీసం వారి కుటుంబాలకు ఆర్థిక సాయంతో భరోసా ఇవ్వాలని హితవు పలుకుతున్నారు. ఆర్సీబీకి నిజంగా అభిమానులపై ప్రేమ ఉంటే చేయాల్సిన మొదటి పని ఇదేనని కామెంట్ చేస్తున్నారు. ఆర్సీబీ ఆటగాళ్లు సైతం మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

వాస్తవానికి ఆర్సీబీ విక్టరీ పరేడ్కు బెంగళూరు పోలీసులు అనుమతి ఇవ్వలేదని వార్తలు వచ్చాయి. కానీ కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ విజయోత్సవ ర్యాలీలో భాగమవ్వడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు అనుమతిచ్చినట్లు అర్థమవుతోంది. బుధవారం బెంగళూరులోని విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఈ విక్టరీ పరేడ్ నిర్వహించారు. తమ అభిమాన జట్టు గెలుపు సంబరాల్లో భాగమయ్యేందుకు అభిమానులు లక్షల్లో తరలి వచ్చారు. దాంతో ఆ ప్రాంతమంతా ఎర్ర సముద్రాన్ని తలిపించింది. విధాన సౌధలో ఆర్సీబీ ఆటగాళ్లను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు గవర్నర్ సత్కరించారు.
అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు బస్సులో చిన్నస్వామి స్టేడియం వెళ్లారు. అక్కడికి లక్షల్లో అభిమానులు తరలిరాగా.. పాసులు ఉన్నవారినే పోలీసులు అనమతించారు. పాసులు లేని కొంతమంది అభిమానులు.. స్టేడియం గోడలు, గేట్లు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఆర్సీబీ ఫ్రాంచైజీ కానీ, ఆటగాళ్లు కానీ స్పందించకపోవడం గమనార్హం.