రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయోత్సవ ర్యాలీలో విషాదం నెలకొంది. తొక్కిసలాట కారణంగా దాదాపు 11 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇందులో చిన్నారులు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు బెంగళూరు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 11 మంది ప్రాణాలను బలి తీసుకున్న ఆర్సీబీపై నిషేధం విధించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా విక్టరీ పరేడ్ నిర్వహించిన ఆర్సీబీపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐని కోరుతున్నారు.
కోహ్లీతో పాటు వారిని అరెస్ట్ చేయాలి..
విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని కొందరంటే.. కర్ణాటక ప్రభుత్వ వైఫల్యమని మరికొందరు మండిపడుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆర్సీబీ ఫ్రాంచైజీ ఓనర్లు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధికారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పుష్ప సినిమా సందర్భంగా తొక్కిసలాటకు బాధ్యుడిని చేస్తూ అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారని, ఇప్పుడు కూడా అదే తరహా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

పోలీసులు అనుమతివ్వలేదు..
వాస్తవానికి ఆర్సీబీ విక్టరీ పరేడ్కు బెంగళూరు పోలీసులు అనుమతి ఇవ్వలేదని వార్తలు వచ్చాయి. కానీ కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ విజయోత్సవ ర్యాలీలో భాగమవ్వడంతో పోలీసులు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం బెంగళూరులోని విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఈ విక్టరీ పరేడ్ నిర్వహించారు. తమ అభిమాన జట్టు గెలుపు సంబరాల్లో భాగమయ్యేందుకు అభిమానుల్లో లక్షల్లో తరలి వచ్చారు. దాంతో ఆ ప్రాంతమంతా ఎర్ర సముద్రాన్ని తలిపించింది. విధాన సౌధలో ఆర్సీబీ ఆటగాళ్లను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు గవర్నర్ సత్కరించారు.
అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు బస్సులో చిన్నస్వామి స్టేడియం వెళ్లారు. అక్కడికి లక్షల్లో అభిమానులు తరలిరాగా.. పాసులు ఉన్నవారినే పోలీసులు అనమతించారు. పాసులు లేని కొంతమంది అభిమానులు.. స్టేడియం గోడలు, గేట్లు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అభిమానులు మరణించడం, గాయపడటం అందర్నీ కలిచి వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
తొక్కిసలాట విషయం తెలియక..
బయట తొక్కిసలాట విషయం తెలియకపోవడంతో ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు కొనసాగాయి. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆటగాళ్లను సత్కరించింది. తొక్కిసలాట విషయం తెలియడంతో ఈ సంబరాలను ఆపేసారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ.. ఇంత మంది అభిమానులు వస్తారని ఊహించలేదని, తనకు 15 రోజుల సమయం ఇవ్వాలని, పూర్తి విచారణ జరిపిస్తానని తెలిపారు. స్టేడియం కెపాసిటీ 35వేలు అయితే 2-3 లక్షల మంది వచ్చారని చెప్పారు.