
హైదరాబాద్: టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మంగళవారం అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. పాకిస్థాన్లో కరోనా వైరస్ కట్టడి కోసం ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఫౌండేషన్కి చేతనైనంత సాయం చేయాలని ఈ సిక్సర్ల సింగ్ అభిమానులకు పిలుపునిచ్చాడు. అయితే దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా యూవీని ఓ ఆట ఆడుకుంటున్నారు. భారత్లో కరోనా కట్టడి కోసం సాయం చేయాల్సిందిపోయి.. శత్రు దేశమైన పాకిస్థాన్కు సాయం చేయమంటావా..? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
పాకిస్థాన్లో కరోనా వైరస్ కట్టడి కోసం అఫ్రిది ఫౌండేషన్ కృషి చేస్తుండటంతో ఇటీవల అతడిపై ప్రశంసలు కురిపించిన హర్భజన్ సింగ్.. అన్నింటికంటే మానవత్వం గొప్పదంటా కితాబిచ్చాడు. తాజాగా యువరాజ్ సింగ్ కూడా అఫ్రిదికి మద్దతు తెలుపుతూ అతని ఫౌండేషన్కు విరాళాలు ఇవ్వాలని ఓ వీడియోను ట్వీట్ చేశాడు.
'ప్రతీ ఒక్కరికి ఇది చాలా కఠినమైన సమయం. ముఖ్యంగా అభాగ్యుల కష్టాలు చెప్పలేనివి. వారికి వీలైనం సాయం చేద్దాం. షాహిద్ అఫ్రిదీ, అఫ్రిదీ ఫౌండేషన్కు నా మద్దతు ఉంటుంది. కోవిడ్-19 కట్టడికి అతను ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయం. దయచేసి ఆ సంస్ధకు విరాళాలు ఇవ్వండి'అని యూవీ విజ్ఞప్తి చేశాడు.
దీంతో.. భారత్ అభిమానులు యువీపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. నీకు తెలివి ఉండే మాట్లాడుతున్నావా..?లేక మతి చెడిందా? అంటూ ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. భారత్లో కరోనా వైరస్ కట్టడి కోసం క్రికెటర్లంతా తమకు తోచిన సాయం చేస్తుండగా.. యూవీ ఇప్పటి వరకు ఎలాంటి సాయం ప్రకటించలేదు. రోహిత్ శర్మ రూ. 80 లక్షలు, సురేశ్ రైనా రూ. 52 లక్షలు, సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు, అజింక్య రహానే రూ. 10 లక్షలు విరాళంగా ప్రకటించగా.. భార్య అనుష్క శర్మతో కలిసి విరాట్ కోహ్లీ రూ. 3 కోట్లు విరాళం ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక ధోనీ రూ. 1 లక్ష విరాళం ప్రకటించినట్లు వార్తలు వస్తుండగా.. అదీ ఓ ట్రస్ట్కు మాత్రమే ఇచినట్లు తెలుస్తోంది. బీసీసీఐ రూ. 51 కోట్ల సాయం అందజేసింది. మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్ రూ.10 లక్షలు, పూనమ్ యాదవ్ రూ.2 లక్షలు, రిచా ఘోష్ లక్ష సాయం అందజేసింది.