ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా స్టార్ పేసర్, తెలంగాణ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో (6/70) ఆరు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అతని ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్కు 180 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.
మహమ్మద్ సిరాజ్ ధాటికి జాక్ క్రాలీ(19), బెన్ స్టోక్స్(0), జో రూట్(22), బ్రైడన్ కార్స్(0), జోష్ టంగ్(0), షోయబ్ బషీర్(0)లు పెవిలియన్ చేరారు. 6 వికెట్లు తీసినా.. మహమ్మద్ సిరాజ్కు రావాల్సిన గుర్తింపు రావడం లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ 6 వికెట్లే బుమ్రా తీసి ఉంటే మాజీ క్రికెటర్లు, బ్రాడ్కాస్టర్స్, మీడియా అహో ఓహో అంటూ ఆకాశానికెత్తేదని అభిప్రాయపడుతున్నారు.

సౌతిండియా ప్లేయర్ కావడంతోనే సిరాజ్పై వివక్ష చూపిస్తున్నారని, అందులో ముస్లిం కావడంతో పెద్దగా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు ఒక్కరు కూడా సిరాజ్ ప్రదర్శనను కొనియాడటం లేదని మండిపడుతున్నారు. జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో సిరాజ్ సగటు బాగుందని, రికార్డ్స్ కూడా బాగున్నాయని కామెంట్ చేస్తున్నారు. సిరాజ్ తన అద్భుత ప్రదర్శనతో బుమ్రా లేని లోటును తీర్చాడని, అతనికి సరైన గుర్తింపు ఇవ్వాలని కామెంట్ చేస్తున్నారు.
180 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్(22 బంతుల్లో 6 ఫోర్లతో 28) నిరాశపర్చగా.. కరుణ్ నాయర్(7 బ్యాటింగ్)తో కలిసి కేఎల్ రాహుల్(28 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా మూడో రోజు ఆటను ముగించాడు. జోష్ టంగ్కు ఓ వికెట్ దక్కింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 244 పరుగులకు చేరింది.
అంతకుముందు 77/3 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. జెమీ స్మిత్(207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్(234 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్తో 158) భారీ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ ఇద్దరే 6వ వికెట్కు 303 పరుగులు జోడించారు. ఈ జోడీని ఆకాశ్ దీప్ విడదీసాడు. హ్యారీ బ్రూక్ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్ను భారత్వైపు మలుపు తిప్పాడు.