ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఆరో ట్రోఫీని ముద్దాడేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. అయితే ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ టైటిల్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుత సీజన్ పరిస్థితులు ఐపీఎల్ 2016ను తలపిస్తున్నాయని, ఆ సీజన్ సెంటిమెంట్ రిపీట్ అయితే ముంబై ఇండియన్స్ విజేతగా నిలవడం ఖాయమని నెటిజన్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచి టైటిల్ సాధించిన ఏకైక జట్టు సన్రైజర్స్ హైదరాబాద్. అది కూడా ఐపీఎల్ 2016 సీజన్లో ఆర్సీబీని ఓడించి టైటిల్ను అందుకుంది.

ఐపీఎల్ 2016 సీజన్లో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచిన ఆర్సీబీ.. క్వాలిఫయర్-1లో టేబుల్ టాపర్ గుజరాత్ లయన్స్ను ఓడించి ఫైనల్ చేరింది. మూడో స్థానంలో నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్ మ్యాచ్లో కేకేఆర్ను ఓడించి.. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్పై గెలిచి టైటిల్ ఫైట్కు అర్హత సాధించింది. ఫైనల్లో ఆర్సీబీ ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది.
తాజా సీజన్లోనూ రెండో స్థానంలో నిలిచిన ఆర్సీబీ.. టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ను ఓడించి ఫైనల్ చేరగా.. ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ను ఓడించి ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు సిద్దమైంది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడించి ముంబై ఫైనల్ చేరితే.. ఐపీఎల్ 2016 రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచి రెండు సందర్బాల్లోనూ క్వాలిఫయర్-2లో ఓటమిపాలైంది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్కు ముందు ఈ రికార్డ్ కలవరపెడుతోంది. ఒకవేళ పంజాబ్ను ఓడించి ముంబై ఫైనల్ చేరితే మాత్రం ఆరో టైటిల్ను కైవసం చేసుకుంటుంది.