
వరుసగా విఫలమవుతున్నా..
మూడు ఫార్మాట్లలో వరుసగా విఫలమవుతున్నా.. జట్టు ఆశలు పెట్టుకున్న ప్రతిసారీ తీవ్రంగా నిరాశ పరుస్తున్నా.. తుది జట్టులో రాహుల్ స్థానానికి ఢోకా ఉండటం లేదు. ప్రతిభావంతులు ఎందరో దేశవాళీల్లో సత్తా చాటుతున్నా.. ప్రస్తుత జట్టులోనే శుభ్మన్ గిల్ సూపర్ ఫామ్తో అదరగొడుతున్నా.. అవకాశం ఇవ్వడం లేదు.
రాహుల్కు మాత్రం ఫామ్తో సంబంధం లేకుండా అపరిమితంగా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. తొలి టెస్ట్లో విఫలమైనా రెండో మ్యాచ్లో అవకాశం కల్పించారు. కానీ రెండు ఇన్నింగ్స్ల్లో 17, 1 పరుగుతో దారుణంగా విఫలమయ్యాడు.
అయితే రాహుల్ ప్రతిభావంతుడు.. అతనికి తమ మద్దతు ఉంటుందని, మరిన్ని అవకాశాలు ఇస్తామని కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రాహుల్ ద్రవిడ్ చెప్పడం అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

24 టెస్ట్ల్లో 27.53 సగటే..
రాహుల్ వైఫల్యం కొన్ని మ్యాచ్లకు, రోజులకు పరిమితం కాదు. గత ఐదేళ్ల నుంచి అతని ప్రదర్శన అత్యంత సాధారణంగా ఉంది. 2018 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆడిన 24 టెస్టుల్లో రాహుల్ సగటు 27.53 మాత్రమే. ఇందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి.
గత కొన్ని నెలల నుంచి అయితే రాహుల్ మరీ దారుణంగా విఫలమవుతున్నాడు. గత 10 టెస్ట్ల్లో 1, 17, 20, 2, 10, 23, 22, 10, 12, 8.. అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చాడు. ఇందులో చివరి ఏడు ఇన్నింగ్స్లు ఉపఖండ పరిస్థితుల్లో ఆడినవే.

గత 6 ఇన్నింగ్స్ల్లో టాప్ స్కోర్ 23
బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల్లో రాహుల్ ఆడిన 4 ఇన్నింగ్స్ల్లో అతడు చేసిన అత్యధిక స్కోరు 23. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల్లో అత్యధికంగా 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రాహుల్పై వేటు వేయడానికి ఈ పేలవ ప్రదర్శన చాలదా అన్నది ప్రశ్న. మిగతా ఫార్మాట్లలో అయినా అతను రాణిస్తున్నాడా? అంటే అదీ లేదు. వన్డేలు, టీ20ల్లో కూడా రాహుల్ ఆట తీసికట్టుగానే ఉంది.
వరుసగా రెండు టీ20 ప్రపంచకప్లతో పాటు ఆసియా కప్లో దారుణంగా విఫలమయ్యాడు. ఆసీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్, దక్షిణాఫ్రికాలతో కీలక మ్యాచ్ల్లో వరుసగా 4, 9 పరుగులే చేసి నిరాశపరిచిన రాహుల్.. ఆపై పసికూన బంగ్లాదేశ్, జింబాబ్వేలపై చెలరేగాడు. ఆ తర్వాత ఇంగ్లండ్తో ముఖ్యమైన సెమీస్ మ్యాచ్కు వచ్చేసరికి మళ్లీ 5 పరుగులకే చేతులెత్తేశాడు.

డబ్ల్యూటీసీ గోవిందా..
గతంలో రాహుల్ కనీసం ఒక పెద్ద ఇన్నింగ్స్ అయినా ఆడేవాడు. ఈ మధ్య అది కూడా ఆడటం లేదు. టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియాపై తీవ్ర విమర్శల నేపథ్యంలో కోహ్లీ, రోహిత్లతో పాటు రాహుల్ కూడా టీ20 ఫార్మాట్కు దూరమయ్యాడు. కానీ టెస్టులు, వన్డేల్లో అతనికి ఎక్కడలేని ప్రాధాన్యం లభిస్తోంది.
కానీ టీమ్ మేనేజ్మెంట్ నమ్మకాన్ని అతను నిలబెట్టుకోలేకపోతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను రాణించి.. ఫామ్లోకి వచ్చిన టీమిండియాకు ముప్పేనని, డబ్ల్యూటీసీ ఫైనల్లో కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుందని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications
