టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా సారథిగా రోహిత్ శర్మను కొనసాగించాలని అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి 29 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీకి యూఎస్ఏ, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ శనివారం విదుల చేసింది.
మొత్తం 20 జట్లు ఈ టోర్నీలో తలపడనుండగా.. నాలుగు గ్రూప్లుగా విభజించారు. ప్రతి గ్రూప్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8 పోరులో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ ఆడనున్నాయి. భారత లీగ్ మ్యాచ్లన్నీ అమెరికా వేదికగానే జరగనున్నాయి.
టీమిండియా తమ తొలి మ్యాచ్ను న్యూయార్క్ వేదికగా జూన్ 5న ఐర్లాండ్తో తలపడనుంది. జూన్ 7న దాయాదీ పాకిస్థాన్తో న్యూయార్క్ వేదికగానే ఆడనుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్ల వివరాలకు సంబంధించిన పోస్టర్లను అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ఈ పోస్టర్లలో టీమిండియా కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఫొటోలను ఉంచింది. దాంతో ఈ పోస్ట్లపై రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ జట్టు తమ టీ20 కెప్టెన్గా షాహిన్ అఫ్రిదిని ప్రకటించిందని, కానీ భారత జట్టు కెప్టెన్సీ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అఫ్గానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్తో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇస్తున్నప్పుడు హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా ఎలా కొనసాగిస్తారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. హార్దిక్ పాండ్యాకు బదులు రోహిత్ శర్మ ఫొటోను వాడలని స్టార్ స్పోర్ట్స్కు సూచిస్తున్నారు.
హార్దిక్ పాండ్యానే కెప్టెన్ అని ఎలా చెబుతున్నారని స్టార్ స్పోర్ట్స్ను నిలదీస్తున్నారు. అధికారికంగా రోహిత్ శర్మ టీ20ల నుంచి వైదొలగలేదని, ఇప్పటికీ అతనే కెప్టెన్ అని కామెంట్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యాకు ఎక్స్ట్రాలు ఎక్కువని, అతను గాయాలతో సతమతమవుతున్నాడని గుర్తు చేస్తున్నారు. ఒంటి నిండా నొప్పులతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేస్తే టీమిండియాకు తీవ్ర కష్టాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.